ఖమ్మంక్రైం: గంజాయి అమ్మకాలు, వినియోగాలను పూర్తిగా నిర్మూలించేలా అనుమానం ఉన్న అన్ని ప్రాంతాల్లో నిఘా పెంచాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ ఆదేశించారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిర్మానుష్య ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపడుతూ గంజాయి వినియోగం, విక్రయాలను అరికట్టడమే కాక బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. అంతేకాక యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే, సైబర్ నేరాల నియంత్రణకు సమర్థవంతమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని, నిందితుల వెనక నెట్వర్క్ను ఛేదించేలా దర్యాప్తు చేపట్టాలని తెలిపారు. బాధితుల నుంచి ఫిర్యాదు రాగానే బ్యాంకులు–ఆర్థిక సంస్థలతో సమన్వయం చేసుకుంటూ నగదు ఫ్రీజ్ చేయించాలని చెప్పారు. కాగా, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, అందుకు కారణాలను విశ్లేషించడం ద్వారా నివారణ చర్యలు చేపట్టాలని సీపీ సూచించారు. అంతేకాక అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్రూట్, హెల్మెట్ , సీట్ బెల్ట్ ధరించని వారిని గుర్తించేలా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే, పోక్సో కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి, నిందితులకు శిక్ష పడేలా కోర్టుల్లో చార్జీషీట్లు దాఖలు చేయాలని సీపీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు రమణమూర్తి, సాంబరాజు, ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.
నేర సమీక్ష
సమావేశంలో
సీపీ సునీల్దత్


