ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జనరల్ ఆస్పత్రి ఆవరణలో నిర్మించిన క్రిటికల్ కేర్ భవనంలో వైద్యసేవలు ప్రారంభమయ్యాయి. జనరల్ ఆస్పత్రిలోని క్యాజువాలిటీ, ఐసీయూ విభాగాల సామగ్రిని గురువారం అందులోకి తరలించారు. ఆస్పత్రి ఆవరణలోని కార్డియాలజీ విభాగం ఎదుట రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వ నిధులతో క్రిటికల్ కేర్ భవన నిర్మాణం మొదలుపెట్టారు. రూ.23.75 కోట్లతో జీ+4 భవనం నిర్మాణం పూర్తికాగా, 40 పడకలు అత్యవసర వైద్యానికి, 20 పడకలు జనరల్ వార్డుకు, మరో ఐదు పడకలు డయాలసిస్ సేవలకు వినియోగించనున్నారు. ఇక జనరల్ ఆస్పత్రిలో ఖాళీ అయిన గదులను ఓపీ సేవలకు వినియోగిస్తారు. ఈక్రమంలోనే అన్ని విభాగాల ఓపీ సేవలు ఒకే చోట అందేలా మార్పు చేయాలని మెడికల్ సూపరింటెండెంట్ నరేందర్ నిర్ణయించారు. ఈమేరకు ఖాళీ అయిన గదుల్లోకి అక్కడక్కడా ఉన్న కార్డియాలజీ, కంటి, ఈఎన్టీ విభాగాల ఓపీ ఏర్పాటుచేస్తున్నట్లు ఆయన తెలిపారు.


