ఖమ్మంమయూరిసెంటర్: బీసీ మహిళలకు రాష్ట్రప్రభుత్వం వందశాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్ల పంపిణీ చేయనుందని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి.జ్యోతి తెలిపారు. జిల్లాలో బీసీ వర్గానికి చెందిన మహిళలు, 18 – 55 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. నిరుద్యోగులు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథల్లో కుట్టు వృత్తిలో నైపుణ్యం కలిగి, ప్రాథమిక అక్షరాస్యత ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల వార్షికాదాయం దాటనివారు తెల్ల రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సూచించారు. అర్హులు ఈనెల 15వ తేదీలోగా tgobmms.cgg.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
క్రీడాసామగ్రి సరఫరాకు టెండర్లు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని 28 పీఎంశ్రీ పాఠశాలలకు క్రీడా సామగ్రి సరఫరా చేసేందుకు టెండర్లు ఆహ్వానించినట్లు అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి గురువారం తెలిపారు. మొత్తం 167 రకాల ఆట వస్తువులు సరఫరా చేయాల్సి ఉండగా, ఒక్కో పాఠశాలకు రూ.50 వేల చొప్పున రూ.14 లక్షలు కేటాయించినట్లు పేర్కొన్నారు. టెండర్ల దాఖలకు జిల్లా వాసులే అర్హులని, దరఖాస్తు రుసుము రూ.4వేలు, ధరావతు రూ.50 వేలను ‘జిల్లా కలెక్టర్ అండ్ చైర్మన్, సమగ్ర శిక్ష, ఖమ్మం’ పేరుతో డీడీ సమర్పించాలని తెలిపారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు టెండర్లు స్వీకరించి, 19న ఉదయం చైర్మన్ సమక్షంలో పరిశీలించి ఖరారు చేస్తామని అదనపు కలెక్టర్ వెల్లడించారు.
స్ఫూర్తిదాయకం..
చాకలి ఐలమ్మ పోరాటం
ఖమ్మంమయూరిసెంటర్: సమాజంలో నెలకొన్న అసమానతలపై నిర్భయంగా పోరాడిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి మార్గదర్శకమని బీసీ సంక్షేమ శాఖ డీడీ జి.జ్యోతి పేర్కొన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలోని ఐలమ్మ విగ్రహం వద్ద గురువారం ఆమె వర్ధతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ జమీందారీ వ్యవస్థ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా ఐలమ్మ సాగించిన పోరాటం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చారిత్రక ఘట్టంగా నిలిచిందన్నారు. ముదిగొండ సొసైటీ చైర్మన్ ఎలగొండ స్వామి, బీసీ, రజక కులసంఘాల నాయకులు జక్కుల వెంకటరమణ, తమ్మరపు బ్రహ్మం, మాచర్ల యాలాద్రి, కోడి లింగయ్య, సట్టు వెంకటేశ్వర్లు, కత్తి నెహ్రూగౌడ్, మునిగ కోటేశ్వరరావు, ఎల్లురి విజయ్ కుమార్, ఎస్.కే.సయ్యద్ బాషా, వల్లపు సోమరాజు, శాఖ అధికారులు పాల్గొన్నారు.


