ఖమ్మం వైరారోడ్: ప్రజల సమస్యలను ఎదుర్కొనే దమ్ము, ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక రాష్ట్రప్రభుత్వం శాసన సభను కౌరవ సభగా మార్చిందని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన జెడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి మాట్లాడారు. శాసనసభ సమావేశాల్లో రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, సీతారామ ప్రాజెక్టు తదితర అంశాలపై చర్చ జరిగితే సమాధానం చెప్పే ధైర్యం లేక ప్రభుత్వం సభను అడ్డుకుందని ఆరోపించారు. కాగా, బీఆర్ఎస్ పార్టీకి శాసనసభ, స్పీకర్ గడ్డం ప్రసాద్పై ఎంతో గౌరవం ఉందని తెలిపారు. అసెంబ్లీ ప్రారంభం నిరసన తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉన్నా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకోవడంతో పాటు తాతా మధు తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసినా ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేయడం గర్హనీయమన్నారు. అంతేకాక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసం ముట్టడికి పిలుపునివ్వడం ఏమిటని ప్రశ్నించారు. నాయకులు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, బిచ్చాల తిరుమలరావు, బొమ్మెర రామ్మూర్తి, హెచ్ ప్రసాద్, ఆరెంపల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
● విద్వేషం, విధ్వంస విధానాలతో రాష్ట్రంలో పాలన సాగుతోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఒక ప్రకటనలో విమర్శించారు. వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వ వైఫల్యాలపై చర్చ జరగకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ నేతలు యత్నిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనపై ఉన్న అసంతృప్తిని కప్పిపుచ్చుకునేందుకే యత్నంచినా.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని ఆయన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య


