ఖమ్మం సహకారనగర్: ప్రతీ అపజయంతో పాఠాలు నేర్చుకుంటే విజయానికి మెట్లుగా నిలుస్తాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారి బి.అనూష తెలిపారు. ఖమ్మంలోని కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల – ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ నడుమ ఒప్పందం కుదరగా, బుధవారం కాలేజీలో జరిగిన సమావేశంలో అనూష ముఖ్య అతిథిగా మాట్లాడారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా ఎంచుకున్న లక్ష్యాన్ని చేరేలా సాధన చేయాలని సూచించారు. ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీ సీఈఓ శశాంక విద్యార్థులు సివిల్స్ సాధించేలా తర్ఫీదు ఇస్తామని తెలిపారు. ఈమేరకు విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగంలో నైపుణ్యాలు పెంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రొఫెసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ జ్ఞానాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా విద్యార్థుల కార్యాచరణ ఉండాలని తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ కోటా అప్పిరెడ్డి మాట్లాడుతూ తమ విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ఏకేఎస్ ఐఏఎస్ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. తొలుత కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కే.వీ.రమణారావు, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఆంజనేయులు, వివిధ విభాగాల బాధ్యులు ఎం.రంగారావు, పాపారావు, అజయ్కుమార్, చైతన్య పాల్గొన్నారు.
భద్రాద్రి జిల్లా పంచాయతీ అధికారి అనూష


