సత్తుపల్లిరూరల్: ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సత్తుపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి శ్రీచరణ్రెడ్డి(19) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం ఇంటికి వచ్చిన ఆయన మంగళవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయాన చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకున్నాడు. కాసేపటికి గమనించిన కుటుంబీకులు సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించేసరికి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా, విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
ఖమ్మంరూరల్: ఖమ్మం వైఎస్సార్నగర్కు చెందిన బోస్ భరత్(24) మున్నేటిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. పోలీ సులు తెలిపిన వివరాల మేరకు... భరత్ తన స్నేహితులు అయిదుగురితో కలిసి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి రాజీవ్గృహకల్ప ఏరియాలో ఈతకు వెళ్లారు. అంతా మున్నేటిలో ఈత కొడుతుండగా భరత్ కాస్త లోతుగా వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చే క్రమాన నీట మునిగాడు. దీంతో స్నేహితులు భరత్ను రక్షించే యత్నంలో పూర్తిగా మునిగిపోవడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు పోలీసులు చేరుకుని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో గాలింపు చేపట్టి మృతదేహాన్ని వెలికి తీయించారు. కాగా, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగానికి సిద్ధమవుతున్న భరత్ మృతితో కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.


