ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చనలు
భద్రాచలం రామాలయంలో భక్తుల సందడి
భద్రాచలం: శ్రావణ శుక్రవారం సందర్భంగా ఇంటింటా వరలక్ష్మీ వ్రతం ఆచరించారు. ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. భద్రాచలం రామాలయంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. మహిళలు వరలక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో కొలిచారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. మిథిలా స్టేడియం ప్రాంగణంలోని శ్రీరామ సేవా మండపంలో దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు. అర్చకులు శ్రావణ మాసం విశిష్టతతో పాటు వరలక్ష్మీ వ్రతం ప్రాధాన్యాన్ని భక్తులకు వివరించారు. వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులకు దేవస్థానం తరఫున పూజా సామగ్రిని అందజేశారు.
సువర్ణ
కవచాలతో రామయ్య
శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలోని మూలమూర్తులు సువర్ణకవచాలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణం కోసం మిథిలా స్టేడియంలోని శ్రీరామ సేవా మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించి స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు.


