● జిల్లాలో ఎక్కడా సమస్య రాకుండా చర్యలు ● నీటి ప్రవాహాలను పరిశీలించిన కలెక్టర్ దివాకర
ఖమ్మం అర్బన్/ఏన్కూరు/కల్లూరు రూరల్: ఎల్నినో ప్రభావంతో కృష్ణా పరివాహకంలో వర్షపాతం తక్కువగా నమోదవుతున్నందున గోదావరి నుంచి తరలిస్తున్న జలాలను తాగునీటి అవసరాల వినియోగానికే ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని వివిధ మండలాల్లో కాల్వలు, రెగ్యులేటర్లు, చెరువులకు చేరుతున్న గోదావరి ప్రవాహాన్ని కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పల్లిపాడు – ఏన్కూరు మార్గంలోని నిమ్మవాగు, ఏన్కూరు వద్ద రాజీవ్సాగర్, ఏన్కూరు ఎన్నెస్పీ 52వ కిలోమీటర్ వద్ద రెగ్యులేటర్, కల్లూరు మండలం పాయపూర్ వద్ద మధిర బ్రాంచ్ కెనాల్, కల్లూరు–బత్తులపల్లి మార్గంలో ఎన్నెస్పీ 21వ ప్రధాన కాల్వ, కప్పలబంధం వద్ద మధిర బ్రాంచ్ కెనాల్ను కలెక్టర్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అంతేకాక మధిర బ్రాంచ్ కెనాల్ 24వ కిలోమీటర్ వద్ద తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులోని రెగ్యులేటర్ను పరిశీలించి దిగువ ప్రాంతాలకు అందుతున్న నీటి వివరాలను ఆరా తీశారు. అలాగే, వేంసూరు మండలంలోని లంకాసాగర్ చెరువుతో పాటు వివిధ చెరువులకు చేరుతున్న నీటి ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగిస్తూ తాగునీటి అవసరాలకు ఇబ్బంది రాకుండా చూడాలని సూచించారు. కాల్వలు, రెగ్యులేటర్లు, ఔట్లెట్లను నిరంతరం తనిఖీ చేయాలని తెలిపారు. నీటి లభ్యతకు అనుగుణంగా చెరువులను నింపేందుకు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జల వనరుల శాఖ సీఈ వాసంతి, ఖమ్మం, కల్లూరు ఎస్ఈలు ఎం.వెంకటేశ్వర్లు, శ్రీకాంత్, ఈఈలు బాబురావు, అర్జున్, డీఈ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.


