పాఠశాలల్లో
అవగాహన కార్యక్రమాలు
అవగాహనతోనే అడ్డుకట్ట
ప్రత్యేక శ్రద్ధతో..
● భద్రాచలం డీ అడిక్షన్ సెంటర్లో వ్యసనపరులకు ఉచితంగా చికిత్స ● ఇప్పటివరకు 200 మందికి సేవలు.. 180 మంది డిశ్చార్జ్ ● ఏజెన్సీ యువతలో మాదకద్రవ్యాలతో నష్టాలపై అవగాహన
భద్రాచలంఅర్బన్: గంజాయి, మద్యం వ్యవసనపరులను సాధారణ స్థితికి తీసుకురావడం కుటుంబాలకు సవాల్గా మారుతోంది. అయితే, భద్రాచలంలోని దక్షత సొసైటీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న డీ అడిక్షన్ కేంద్రం బాధితులను మామూలు స్థితికి చేర్చే ప్రయత్నం చేస్తోంది. ఈ కేంద్రాన్ని శాంతినగర్లో 2025 ఏప్రిల్ 1న ప్రారంభించగా, మాదకద్రవ్యాల బారిన పడిన పురుషులకు ఉచితంగా వసతి, భోజనం కల్పించి చికిత్స అందిస్తున్నారు. కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ మద్దతుతో ఇక్ర్రా, సీపీఎల్ఐ, ఓడీఐసీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 200 మందికి చికిత్స అందగా, 180 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఏజెన్సీవారే ఎక్కువ
కేంద్రానికి వచ్చేవారిలో భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారి సంఖ్యే అధికంగా ఉంది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 15 మందిలో 18 – 50 ఏళ్ల వయస్సుల వారు ఉన్నారు. వీరిలో 12 మంది గంజాయి, ముగ్గురు మద్యం వ్యసనంతో బాధపడుతుండగా చేర్పించారు. వ్యక్తిగత, గ్రూప్, కుటుంబ కౌన్సెలింగ్తోపాటు అవసరాన్ని బట్టి వైద్య పరీక్షలు, మందులు అందిస్తున్నారు. యోగా, ధ్యానంలో శిక్షణ ఇస్తున్నారు.
రెండేళ్ల వరకు బాగోగులు తెలుసుకుంటూ..
కేంద్రంలో నెల పాటు చికిత్స అందించాక ఇంటికి పంపిస్తారు. ఆ తర్వాత కూడా రెండేళ్ల పాటు కుటుంబ సభ్యులతో ఫోన్ ద్వారా సంబంధాలు కొనసాగిస్తూ పరిస్థితులు సమీక్షిస్తారు. అవసరమైతే తిరిగి కేంద్రానికి రప్పించే అవకాశం ఉంది. చికిత్స పొందిన 180 మంది డిశ్చార్జ్ కాగా, వీరిలో 70 శాతం మంది పూర్తిగా వ్యసనానికి దూరమయ్యారని నిర్వాహకులు తెలిపారు.
అనువైన భవనం కోసం
భద్రాచలంలోని కేంద్రంలో ప్రస్తుతం 15 మంది ఉన్నారు. చికిత్స అవసరమైన వారి సంఖ్య ఎక్కువగా కావడంతో వసతులు సరిపోవడంలేదు. అనువైన భవనం కోసం ప్రభుత్వ స్థలాన్ని, లేదా ఎక్కువ మంది బాధితులు వచ్చినా సరిపోయే ప్రభుత్వ భవనం కోసం వేచిచూస్తున్నారు. అంతేకాక వైద్య, మానసిక ఆరోగ్య నిపుణుల సేవలు కూడా అవసరమని చెబుతున్నారు.
గంజాయి మహమ్మారిని అడ్డుకునేందుకు సీపీఎల్ఐ ద్వారా స్థానిక పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వాటికి దూరంగా ఉండే విధానం, ఇతరులను ఎలా అప్రమత్తం చేయాలనే అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు ఆరు బ్యాచ్లలో మొత్తం 1,320 మంది శిక్షణ ఇచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. శిక్షణ పొందిన విద్యార్థులు తమ పరిధిలో మరో పది మందికి అవగాహన కల్పించే విధానం అమలులో ఉంది. ఓడీఐసీ ద్వారా స్లమ్ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి మాదకద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్నారు. అవసరమైన వారిని కౌన్సెలింగ్, చికిత్స కోసం రిఫర్ చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇలాంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా కుటుంబాలు, విద్యాసంస్థల బాధ్యులు, స్వచ్ఛంద సంస్థలు, పోలీసులు కలిసి పనిచేయాలి. వ్యసనానికి గురైన వారిని గుర్తించి డీ ఎడిక్షన్ కేంద్రానికి పంపిస్తున్నాం.
– బి.రోహిత్రాజు,
ఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం
కేంద్రానికి వచ్చే వారి శారీరక, మానసిక పరిస్థితిని అంచనా వేసి చికిత్స అందిస్తాం. డీటాక్సిఫికేషన్ సమయాన ఆరోగ్య పరిస్థితిని జాగ్రత్తగా పరిశీలిస్తాం. మందులతోపాటు కౌన్సెలింగ్, కుటుంబ సహకారం చికిత్సలో కీలకమే. డిశ్చార్జ్ అయ్యాక కూడా కుటుంబీకులు శ్రద్ధ చూపాలి.
– ఈట ఉదయ్,
డీ అడిక్షన్ కేంద్రం వైద్యుడు


