వైరారూరల్: అనారోగ్య సమస్యలు తాళలేక పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే, భర్త నుంచి దూరంగా ఆమె ఆత్మహత్యకు మరో వ్యక్తి కారణ మంటూ కుటుంబీకులు ఆందోళనకు దిగగా పోలీసులు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
విడివిడిగా దంపతులు
వైరా మండలం గొల్లెనపాడు గ్రామానికి చెందిన మామిడాల నాగమణి(36)కి ఖమ్మం అర్బన్ మండలం అల్లిపురం గ్రామానికి చెందిన మామిడాల ఉపేందర్రావుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు జన్మించగా, గొడవలు జరుగుతుండడంతో ఆరేళ్ల క్రితం విడిపోరయారు. వీరి కుమార్తె హర్షిత తల్లి నాగమణి వద్ద, కుమారుడు తండ్రి వద్ద ఉంటున్నాడు. నాగమణి కూలీ పనులు చేస్తూ కుమార్తెను గురుకుల కళాశాలలో డిగ్రీ చదివిస్తోంది. అయితే, కొద్దినెలలుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఆమె ఈనెల 17న రాత్రి నొప్పి భరించలేక పెట్రోల్ పోసుకోని నిప్పంటించుకుంది. దీంతో బంధువులు ఆమెను ఖమ్మం ఆస్పత్రికి, అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా 18వ తేదీన సాయంత్రం మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం నాగమణి మృతదేహాన్ని బుధవారం గొల్లెనపాడు తీసుకురాగా, అదేగ్రామానికి చెందిన కంకణాల సురేష్ మూడేళ్ల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడంటూ బంధువులు ఆందోళనకు దిగారు. ఆయన చేతులకు కూడా కాలిన గాయాలు ఉండడంతో నాగమణిపై ఆయనే పెట్రోల్ పోసి నిప్పంటించి ఉంటాడని ఆరోపించారు. దీంతో ఎస్సై పి.రామారావు, సిబ్బందితో చేరుకుని మాట్లాడారు. కిడ్నీ నొప్పి భరించలేక నాగమణి ఆత్మహత్య చేసుకుందని కుమార్తె హర్షిత ఫిర్యాదు చేయగా, ఆమె కూడా వరంగల్ ఎంజీఎంలో తన చావుకు ఎవరు కారణం కాదని వాంగ్మూలం ఇచ్చిందని వివరించారు. ఈమేరకు కేసు నమోదు చేశామని నచ్చచెప్పడంతో బంధువులు శాంతించారు.
మరో వ్యక్తి కారణమని
కుటుంబీకుల ఆందోళన


