ఖమ్మంక్రైం: రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు, నిల్వ చేయడమే కాక ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాజా రామారావుపై పీడీయాక్ట్ నమో దు చేసినట్లు పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలి పారు. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలానికి చెందిన రేషన్ డీలర్ రామారావు పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమంగా సేకరించేలా లబ్ధిదారుల బయోమెట్రిక్ వేలిముద్రలను దుర్వి నియోగం చేయడమే కాక ఏజెంట్ల సాయంతో కొనుగోలు చేయిస్తున్నట్లు గుర్తించారు. ఆయనపై ఈ ఏడాది ఏప్రిల్ 28నుంచి మే 26వ తేదీ వరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని కల్లూరు, తల్లాడ, ఎర్రుపాలెం, చండ్రుగొండ పోలీసుస్టేషన్లలో ఐదు కేసులు నమోదు కాగా, 2024లో కూడా తల్లాడు, కల్లూరులో రెండు కేసులు నమోదయ్యా యి. అయినా తీరు మార్చుకోకపోవడంతో రామారావుపై నమోదైన పీడీ యాక్టు ప్రతులను బుధవారం హైదరాబాద్ చంచలగూడ జైలులో ఆయనకు సత్తుపల్లి రూరల్ సీఐ ముత్తలింగం అందజేశారు. కాగా, పేదలకు అందాల్సిన బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు, నిల్వ చేయడం, బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై కఠినమైన, చట్టపరమైన చర్యలు తప్పవని సీపీ స్పష్టం చేశారు. అయితే, రామారావుకు సంబంధించి ఏజెంట్లు జిల్లా వ్యాప్తంగా ఉన్నందున పోలీసులు నిఘా పెంచాలని పలువురు కోరుతున్నారు.
కేసులు నమోదైనా మారని డీలర్ తీరు


