సగానికి పైగా నిలిచిన రోగ నిర్ధారణ పరీక్షలు
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జనరల్ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ నిర్వహణకు అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ సగానికి పైగా రోగనిర్ధారణ పరీక్షలు నిలిచిపోయాయి. దీంతో హబ్లో ఏ రోజు ఏ పరీక్ష ఉంటుందో, ఏది నిలిచిపోతుందో తెలియక క్షేత్ర స్ధాయిలోని వైద్య సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. జనరల్ ఆస్పత్రిలోని డయాగ్నస్టిక్ హబ్కు జిల్లాలోని పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, ఏరియా ఆస్పత్రుల నుంచి నిత్యం రక్త నమూనాలు వస్తుంటాయి. శాంపిళ్లను ప్రత్యేక వాహనాల్లో హబ్కు చేరవేస్తుండగా.. పరీక్షలు చేసి నివేదిక పంపించాలి. తీరా నమూనాలు తీసుకొచ్చాక పరీక్షలు నిలిచిపోయి రోజుల తరబడి నివేదికలు రాకపోవడంతో అత్యవసరమైన వారు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించి నష్టపోతున్నారు.
134 పరీక్షల్లో చేసేది 55 పరీక్షలే
గత ప్రభుత్వం ప్రతీ జిల్లా కేంద్రంలో తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్లను ఏర్పాటు చేసింది. ఖమ్మంలోని హబ్లో తొలుత రోగ నిర్ధారణ పరీక్షలు సజావుగానే సాగినా, రానురాను అవాంతరాలు సాధారణమయ్యాయి. ఒక్కోసారి రక్తపరీక్షలు నిర్వహించటానికి అవసరమైన రీఏజెంట్ల కొరత, ఇంకొన్ని సార్లు హబ్కు నీటి సరఫరా చేసే ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులతో ఇబ్బంది వస్తోంది. గంటకు 1,200 టెస్టులు చేసే కెమిస్ట్రీ అనలైజర్, ఇమ్యూనో అనలైజర్ మిషన్లు పాతవి కావడం ప్రస్తుత అవాంతరానికి కారణమని తెలుస్తోంది. కొత్త యంత్రాలు పంపించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినా జాప్యం చేస్తుండడంతో హబ్ ద్వారా చేయాల్సిన 134 రకాల పరీక్షలకు గాను ప్రస్తుతం 55 పరీక్షలే నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రధానమైన లిపిడ్ ప్రొఫైల్, వివిధ రకాల విటమిన్ టెస్టులు లేకపోవడం గమనార్హం.


