ఖమ్మంరూరల్: ముందస్తు ప్రణాళికతోనే మారుతి రామారావును హతమార్చేందుకు కుట్ర చేశారని బీఆర్ఎస్ నేత అల్లిక వెంకటేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితులు, స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. రామారావు కొద్ది రోజుల క్రితం సీపీఐ నుంచి బీఆర్ఎ్స్లో చేరగా.. గతంలో ఓ సీపీఐ నాయకుడికి రామారావుకు సుమారు రూ.6 లక్షలు ఇవ్వాల్సి ఉన్నందున పదేపదే అడగడంతో అతడిని బెదిరింపులకు పాల్పడడంతో తనకు ప్రాణహాని ఉందని రామారావు ఈనెల 14వ తేదీన ఖమ్మం ప్రెస్క్లబ్లో విలేకరులకు విన్నవించినట్లు చెప్పారు. 16న ఖమ్మం నుంచి అదే గ్రామానికి చెందిన బట్టు రామారావుతో కలిసి బైక్పై రాత్రి సమయాన గూడూరుపాడుకు వస్తుండగా.. గ్రామ పొలిమేరలో ఇద్దరు వ్యక్తులు మరో బైక్పై వచ్చి రాడ్లతో దాడి చేశారన్నారు. ఈఘటనలో మారుతి రామారావు తప్పించుకోగా.. బట్టు రామారావుకు తీవ్ర గాయాలు కావడంతో సోమవారం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. రామారావును అంతమందించేందుకుగాను 9 మంది సభ్యులు పథకం ప్రకారం కుట్ర పన్నారని, ఈ కుట్రకు పాల్పడిన వ్యక్తులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు ఉన్నతాధికారులను కోరారు. గ్రామంలో గాంజా కేసులలో ఉన్న వారిని ఉసిగొలిపి దాడులకు పాల్పడుతున్నారని, ఇలాంటి చర్యలకు ఫుల్స్టాప్ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బండి అమ్మరాజు, పడగల వెంకటేశ్వర్లు, కుర్రి లింగయ్య, కొర్రి తిరుపతిరావు, పడిగల రాము తదితరులు పాల్గొన్నారు.


