● అరాచకాలను ప్రోత్సహిస్తున్న ఖమ్మం నేతలు ● బీఎల్ఏల సమావేశంలో మాజీ మంత్రి పువ్వాడ
ఖమ్మంఅర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రకటనలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. తెలంగాణ ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఖమ్మం నగరం, నియోజకవర్గం అభివృద్ధి చెందగా.. ఆ పనులను తమ ఖాతాలో వేసుకునేందుకు ఇక్కడి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిన్నారని పేర్కొన్నారు. ఖమ్మంలో గోపాలపురంలో ఆదివారం జరిగిన పార్టీ బీఎల్ఏల సమావేశంలో పువ్వాడ మాట్లాడారు. ఖమ్మం కొత్త బస్టాండ్, గోళ్లపాడు చానల్ బీఆర్ఎస్ హయాంలో జరగగా, మున్నేరుపై తీగల వంతెన, రిటైనింగ్ వాల్, ఇంజినీరింగ్ కళాశాల మంజూరుకు అప్పుడే శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆతర్వాత కాంగ్రెస్ అధికారంలోకి చేసిన అభివృద్ధి ఏమీ లేకపోగా, కేంద్ర ప్రభుత్వం నిర్మించిన దేవరపల్లి – ఖమ్మం హైవేను మంత్రి తుమ్మల తన ఘనతకు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాక ఖమ్మం నియోజకవర్గంలో అరాచకాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. గతంలో తనను విమర్శించిన వారు ఇప్పుడు మంత్రి, ఆయన కుమారుడి పక్కన ఉంటూ ఇసుక, మట్టి, భూముల విషయంలో అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కాగా, నాలుగు దశాబ్దాలుగా అనుబంధం కలిగిన ఖమ్మం నియోజకవర్గం నుంచే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని.. ఈ విషయంలో అసత్య ప్రచారాలను నమ్మొద్దని పువ్వాడ కోరారు. ఇక ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో పార్టీ బీఎల్ఏలు, నాయకులు క్షేత్రస్థాయిలో విశేషంగా కృషి చేశారని తెలిపారు. అయితే, ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియను చివరి వరకు పర్యవేక్షించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో డీసీసీబీ, సుడా మాజీ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, బచ్చు విజయ్కుమార్, ఆంధ్రాబ్యాంక్ కర్షకసేవా సంఘం చైర్మన్ భీరెడ్డి నాగచంద్రరెడ్డితో పాటు నాయకులు పగడాల నాగరాజు, కర్నాటి కృష్ణ, నాగండ్ల కోటేశ్వరరావు, కూరాకుల వలరాజు, దండా జ్యోతిరెడ్డి, బిక్కసాని జస్వంత్, బత్తుల మురళి దేవభక్తిని కిషోర్, వాంకుడోత్ సురేష్, కందాల వీరేందర్గౌడ్, వల్లభనేని రామారావు, షకీనా, గాదె అనిల్ తదితరులు పాల్గొన్నారు.


