ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి నెల నెలా వెన్నెల 108వ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్నిగ్ధ రచనలో ఎన్.శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘సహాన’నాటికను ప్రదర్శించారు. అన్యాయంపై తిరుగుబాటు చేస్తూ, సమాజంలో నిజాయితీగా ఉండేందుకు ఓ తండ్రి, కూతురు సాగించిన జీవన పోరాటం ఇతివృత్తంగా నాటికను రూపొందించారు. నాటికలో ఎన్.రవీందర్రెడ్డి, వీసీహెచ్కే ప్రసాద్, మీరయ్య, పోతురాజు, లక్ష్మణశాస్త్రి, శ్రీలేఖ, కుసుమసాయిలు పాత్రలను పోషించారు. ఈ నాటిక ప్రేక్షకులను ఆలోచింపజేసింది. నాటికకు ముందుగా దైవం మానుష్య లఘుచిత్రాన్ని ప్రదర్శించారు. నృత్య కళాభారతి వైరాకు చెందిన చిన్నారులు కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో నాటిక బాధ్యులకు తెలంగాణ ఏజెన్సీస్ సంస్థల అధినేతకాళ్ల రామారావు 11వ వర్ధంతి పేరిట పారితోషికాన్ని కుటుంబ సభ్యులచే అందించారు. కార్యక్రమంలో రంగస్థల కళాకారులు ఎస్వీఎల్ ప్రసాద్, వ్యాపారవేత్త కాళ్ల పాపారావు, కన్యకా పరమేశ్వరి దేవాలయం చైర్మన్ మేళ్లచెరువు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రతి నెల నెల నెలా వెన్నెల కార్యక్రమాలను సమాజహితం కోసం నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎన్.సీతారం, బద్రినారాయణ, కృష్ణమోహన్, భాస్కర్, శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్యక్రమాలను నెల నెలా వెన్నెల నిర్వాహకులు అన్నాబత్తుల సుబ్రహ్మణ్యకుమార్, మోటమిర్ర జగన్మోహన్రావు, నామా లక్ష్మీనారాయణ, వేములసదానందం, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


