తిరుమలాయపాలెం: మండలంలోని బచ్చోడులో కొందరు యువకులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. గ్రామ ఎస్సీ కాలనీలో ఇటీవల ఓ వ్యక్తి మృతి చెందగా కర్మకాండలు సోమవారం జరిగాయి. ఇందులో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన ఐదుగురు యువకులు మద్యం మత్తులో నానా హంగామా చేశారు. తొలుత బస్టాండ్ సెంటర్ బచ్చోడు తండాకు చెందిన ఆటో ఎక్కేందుకు ప్రయత్నించే క్రమాన గొడవ జరిగింది. దీంతో ఆటో డ్రైవర్ ఇస్లావత్ సాయిచరణ్ను ఇనుప రాడ్లతో కొడుతుండగా ఆపేందుకు ప్రయత్నించిన చింతల ప్రశాంత్, చింతల రామకృష్ణ, చింతల వీరబాబు, ఉపేందర్, రమేష్, రామనబోయిన ఉపేందర్, రామనబోయిన వెంకటేశ్వర్లుపై రాడ్లు, రాళ్లతో దాడి చేయగా తీవ్రగాయాలయ్యాయి. ఈక్రమాన గ్రామస్తులంతా కలిసి గొర్రెపాటి వాసును పట్టుకుని చెట్టుకు కట్టేసి పోలీసులకు అప్పగించారు. మిగతా నలుగురు పరారవగా ఎస్సై కె.జగదీశ్, సిబ్బంది చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పారిపోయిన గొర్రెపాటి సురేష్, గొర్రెపాటి ప్రసాద్, నాగరాజు, చింటూ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


