సింగరేణి కుంభకోణాలపై
ఖమ్మంమామిళ్లగూడెం: సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించి.. వాటాల వారీగా పంచుకుంటున్న అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్కుమార్ డిమాండ్ చేశారు. ఖమ్మంలోని మామిళ్లగూడెంలో టీఆర్ఎల్డీ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి అస్తవ్యస్తంగా మారగా, బొగ్గును వాటాల వారీగా దోచుకుంటున్నారని ఆరోపించారు. ఆంధ్రా కాంట్రాక్టర్ల పెత్తనం, అధికారుల చేతివాటం పెరగడంతో సింగరేణి మనుగడ దెబ్బతినే ప్రమాదముందని తెలిపారు. అలాగే, ఖమ్మం జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టాలనే డిమాండ్తో త్వరలోనే ఆందోళనలు చేపడుతామని దిలీప్కుమార్ తెలిపారు. కాగా, తమ పార్టీ ఆధ్వర్యాన వచ్చేనెల 26న జాబ్ మేళా నిర్వహించనుండగా, అదేరోజు అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ‘లక్ష్యం కోసం.. లక్ష సైన్యం’కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. అంతేకాక త్వరలో జరిగే ఖమ్మం – నల్లగొండ – వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తాను పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ జానీ మహమ్మద్, నాయకులు మోత్కూరి వెంకటేశ్వరాచారి, పి.వీరప్ప, ఎన్.నర్సింహారావు, విశాల్, గిరి, చెన్నోజు వెంకటరమణాచారి, ఇటుకల లత, బండి నాగమణి పాల్గొన్నారు.
టీఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్కుమార్


