రవాణాకు రైల్వే క్లోజ్డ్
కంటైనర్ల ప్రవేశం..
థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో
వేలాది టన్నుల బూడిద
సిమెంట్ పరిశ్రమల్లో
అధికంగా వినియోగం
రవాణా భారంతో ముందుకు రాని
ఇతర పరిశ్రమలు
రైళ్ల ద్వారా రవాణా చేస్తే
ఖర్చు తగ్గే అవకాశం
సాక్షి ప్రతినిధి భద్రాద్రి కొత్తగూడెం: కేటీపీఎస్ విస్తరణకు స్థల, నిధుల సమస్య కంటే బూడిద నిర్వహణే పెద్ద అడ్డంకిగా మారింది. అయితే, బూడిద రవా ణా సేవల్లోకి రైల్వే ఎంట్రీ ఇవ్వబోతోంది. దీంతో థర్మల్ పవర్ ప్లాంట్ బూడిదకు పారిశ్రామిక, నిర్మాణ రంగాల్లో డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
భారీ ఎత్తున వెలువడుతున్న బూడిద
కేటీపీస్లో రోజూ 3,500 టన్నుల బూడిద వెలువడుతోంది. ఇంచుమించు ఇదేస్థాయిలో భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నుంచీ వస్తోంది. భారీస్థాయిలో అవక్షేపంలా పేరుకుపోయే బూడిదను పర్యావరణానికి హానీ కలిగించని విధంగా నిల్వ చేయాల్సి ఉంటుంది. పారిశ్రామిక అవసరాలను సైతం ఉచితంగా/నామమాత్రపు ధరకు ఇస్తుంటారు. ప్రస్తుతం థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వెలువడే బూడిదలో సుమారు 30 శాతం సిమెంట్ పరిశ్రమలే తీసుకుంటున్నాయి. రోడ్లు, ఇతర నిర్మాణ రంగాల్లోనూ బూడిద వినియోగించే అవకాశం ఉంది.
రవాణా భారం
బూడిద రవాణాకు సాధారణ లారీలతోపాటు ఫ్లైయాష్ ట్యాంకర్లను వినియోగిస్తారు. బీటీపీఎస్, కేటీపీఎస్ నుంచి నిత్యం వందకు పైగా ఫ్లైయాష్ ట్యాంకర్లు వెళ్తుంటాయి. రవాణా భారం ఎక్కువ కావడంతో సిమెంట్ రంగాన్ని మినహాయిస్తే ఇతర పారిశ్రామిక, నిర్మాణ రంగాలు బూడిద వినియోగానికి మొగ్గు చూపడం లేదు. దీంతో విడుదలయ్యే బూడిదలో 50శాతానికి మించి నిల్వ చేయాల్సి రావ డం తలకుమించిన భారంగా మారుతోంది. ఇందుకోసం వందలాది ఎకరాల్లో యాష్పాండ్లు ఏర్పాటు చేయాల్సి రావడం, దాన్ని సమర్థంగా నిర్వహించాల్సి రావడం సవాల్గా మారింది.
ప్రయోజనాలు
రోడ్డు మార్గంతో పోల్చితే రైలు మార్గంలో రవాణా ఖర్చులు చాలా తక్కువ. దీన్ని సానుకూల అంశంగా పారిశ్రామిక, నిర్మాణ రంగం భావిస్తే థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో వెలువడే బూడిదకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు థర్మల్ పవర్ ప్లాంట్పై బూడిద నిర్వహణకు సంబంధించిన చిక్కులు కొంత మేరకు తొలగిపోయే అవకాశం ఉంది. బూడిద రవాణాకు రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఆ మేరకు రోడ్డు మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి.
విధాన, నిర్మాణాత్మక రంగాల్లో మొత్తం 17 రకాల సంస్కరణలు ప్రవేశపెట్టబోతున్నట్టు ఇటీవల రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. అందులో నిర్మాణాత్మకై న సంస్కరణలో మొదటిదిగా థర్మల్ పవర్ ప్లాంట్లలో వెలువడే బూడిద ట్రాన్స్పోర్టును చేర్చారు. ప్రస్తుతం బొగ్గు రవాణాకు ఉపయోగించే సాధారణ వ్యాగన్లే బూడిద రవాణాకు రైల్వే అందుబాటులో ఉంచింది. టాప్ ఓపెన్గా ఉండే ఈ వ్యాగన్లలో బూడిద రవాణాతో ప్రయోజనాల కంటే నష్టాలే అధికం. దీంతో యాష్ ట్రాన్స్పోర్టుకు రైల్వేపై ఎవరూ ఆధారపడటం లేదు. ఈ లోపాన్ని గుర్తించిన రైల్వేశాఖ, బూడిద రవాణా కోసం క్లోజ్డ్గా ఉండే ప్రత్యేక కంటైనర్లను ప్రవేశపెట్టాలని తాజాగా నిర్ణయించింది.


