కారేపల్లి: కారేపల్లి మండలం గుట్టకిందిగుంపు గ్రామంలోని గంగదేవిగుట్టపై రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యాయన రూ.10కోట్లతో నిర్మించనున్న గోదాం పనులకు అడుగడుగునా అడ్డంకులు వస్తున్నాయి. నెల క్రితం నిర్మాణానికి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాందాస్నాయక్ శంకుస్థాపన చేశారు. గుట్టపై మట్టిని కాంట్రాక్టర్ జేసీబీలతో తొలగిస్తారని, మట్టి అవసరమైన వారు ఎవరికీ రూపాయి కట్టకుండా ట్రాక్టర్లు, టిప్పర్లలో తీసుకెళ్లవచ్చని ప్రకటించారు. ఈక్రమాన కొందరు టిప్పర్ల యజమానులు రంగంలోకి దిగి రూ.3వేల నుంచి రూ.3,500 చొప్పున ధర నిర్ణయించి మట్టి అమ్ముకోవడం మొదలుపెట్టారు. ఇది పక్కన పెడితే ప్రతీ టిప్పర్కు రూ.500 చొప్పున గ్రామాభివృద్ధికి చెల్లించాలని సర్పంచ్ సమక్షంలో గ్రామస్తులు కమిటీ ఏర్పాటు చేసుకుని వసూలు చేస్తున్నారు. ఇదంతా చూసినా కాంట్రాక్టర్కు మరో ఆలోచన వచ్చింది. జేసీబీలతో ఉచితంగా మట్టిని టిప్పర్లో వేస్తున్నందున.. గ్రామాభివృద్ధి పేరిట వసూలు చేస్తున్న నగదులో కొంత డీజిల్ ఖర్చులకు ఇవ్వాలని సూచించాడు. దీనికి కమిటీ సభ్యులు ససేమిరా అనడంతో శనివారం నుంచి టిప్పర్లలో మట్టి ఎత్తేది లేదంటూ జేసీబీ ఆపరేటర్లను పంపించాడు. దీంతో టిప్పర్లన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమస్య తీవ్రరూపం దాల్చకముందే ఉన్నతాధికారులు చొరవ చూపాలని పలువురు కోరుతున్నాన్నారు.


