కొంతమేర రక్షణ
● ఆకేరు అక్విడెక్ట్లో బండరాళ్ల తొలగింపు ● మంత్రి పొంగులేటి ఆదేశాలతో ముమ్మరంగా పనులు
తిరుమలాయపాలెం: ఏటా వర్షాకాలంలో ఆకేరు ప్రవాహం వస్తుందంటే మండలంలోని రాకాసి తండా వాసుల్లో ఆందోళన మొదలవుతుంది. 2024 సెప్టెంబర్ 1న భారీ వర్షాలతో వచ్చిన వరదలు తండాను ముంచెత్తాయి. అయితే, సీతారామ ప్రాజెక్టులో భాగమైన అక్విడెక్ట్ నిర్మాణం సందర్భంగా కాంట్రాక్టర్ చేసిన తప్పిదమే ఇందుకు కారణమని రాకాసితండా వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ముప్పు మరోమారు ఎదురుకాకుండా అక్విడెక్ట్లో అడ్డుగా ఉన్న గుట్టలు, బండరాళ్ల తొలగింపు పనులు మొదలవడంతో స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
‘సాక్షి’లో కథనం.. మంత్రి ఆదేశాలు
అక్విడెక్ట్లో అడ్డుగా గుట్టలు ఉండడంతో ఆకేరు ప్రవాహం సాఫీగా సాగక రాకాసి తండాను ముంచెత్తినట్లు గుర్తించారు. ఈ విషయమై గత ఏడాది ఆగస్టు 13న ‘అక్విటెక్ట్కు అడ్డుగా గుట్టలు’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితం కాగా, అదేరోజు అప్పటి కలెక్టర్ అనుదీప్ పరిశీలించి అక్విటెక్ట్ ఖానా(నీరు వెళ్లే మార్గం)లకు అడ్డుగా ఉన్న గుట్టలను తొలగించాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. ఇటీవల తిరుమలాయపాలెంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన ప్రజా దర్బార్లో కూడా రాకాసితండా వాసులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీంతో మంత్రి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన కాంట్రాక్టర్ సమీపాన రైతులతో మాట్లాడి ఏడు నెలల్లో భూములకు ప్రభుత్వ పరిహారం అందేలా చూస్తానని చెప్పడమే కాక ప్రస్తుతం పంట నష్టపోయినందుకు కౌలు చెల్లించేందుకు అంగీకరించి పనులకు ఒప్పించాడు. ఈమేరకు అక్విటెక్ట్లోని 11 ఖానాలకు అడ్డుగా గుట్టలు, బండరాళ్లను తొలగింపున పనులు పొక్లెయినర్లు, డంపర్లతో చేయిస్తున్నారు. ఐదు రోజులుగా జరుగుతున్న ఈ పనులు మరో వారంలోగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఇరిగేషన్ డీఈ బాణాల రమేష్రెడ్డి తెలిపారు.
అక్విటెక్ట్ ఖానాల వద్ద పెద్దపెద్ద బండరాళ్లు అడ్డుగా ఉండడంతో ఆకేరు వరద వెళ్లే మార్గం లేక మా తండాను ముంచెత్తుతోంది. ఈ విషయమై ఇటీవల ప్రజాదర్బార్లో మంత్రి పొంగులేటి శ్రీనివారెడ్డికి ఫిర్యాదు చేశాం. దీంతో గుట్టలు, బండరాళ్లు తొలగింపు చేపడుతుండడంతో ఆనందంగా ఉంది. ఈ పనులు పూర్తయితే ఆకేరు వరద నుంచి మా గ్రామానికి కొంత రక్షణ లభిస్తుంది.
– భూక్యా దేశ్యా, రైతు, రాకాసితండా


