మధిర: యువత అందుబాటులో ఉన్న వనరుల ద్వారా నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే మెరుగైన అవకాశాలు లభిస్తాయని ‘మై భారత్’ పోర్టల్ జిల్లా ఇన్చార్జ్ ఎం.రాంబాబు తెలిపారు. మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యాన ‘యువతకు అందుబాటులో ఉన్న అవకాశాలు’ అంశంపై అవగాహన కల్పించారు. ఈ సదస్సులో రాంబాబు మై భారత్ పోర్టల్లో నమోదు, తద్వారా లభించే నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను వివరించారు. పోటీ ప్రపంచంలో చదువుకుంటూనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు సాధిస్తే విజయం సొంతమవుతుందని తెలిపారు. ఈమేరకు విద్యార్థులు పోర్టల్లో నమోదు చేసుకుని ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైస్ ప్రిన్సిపాల్ అరుణ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పి.సుజాత, అధ్యాపకులు డాక్టర్ ఇందిర, పి.శ్రీనివాస్, ఉద్యోగులు పాల్గొన్నారు.
నేటి నుంచి నేత్ర వైద్య నిపుణుల రాష్ట్రస్థాయి సదస్సు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మంలోని మమత వైద్య కళాశాలలో శుక్రవారం నుంచి 19వ తేదీ వరకు 11వ రాష్ట్ర స్థాయి నేత్ర వైద్య నిపుణుల సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు దేశ, విదేశాలే కాక రాష్ట్రంలోని పలువురు నేత్ర వైద్య నిపుణులు సమారు 800మంది పాల్గొని ఆధునిక చికిత్స పద్ధతులు, అత్యాధునిక పరికరాల వినియోగంపై చర్చిస్తారని డాక్టర్ రెండుచింతల రాధాకృష్ణ తెలిపారు. అంతేకాక 70 కంపెనీల నేత్ర వైద్య పరికరాలు ప్రదర్శనలో ఉంటాయని వెల్లడించారు. నేత్ర వైద్య నిపుణుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు విజయ్కుమార్, ప్రవీణ్తో పాటు రవీంద్ర, లావణ్య, సాహితి, సత్యనారాయణమూర్తి, రామకోటయ్య తదితరులు పాల్గొంటారని తెలిపారు.
పట్టుదలతో చదివితే విజయం
కారేపల్లి: విద్యార్థి దశలోనే లక్ష్యాలు ఎంచుకుని పట్టుదలతో చదివితే విజయాలు సొంతమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారి జి.సదానందం తెలిపారు. కారేపల్లి కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని గురువారం తనిఖీ చేసిన ఆయన 10వ తరగతి విద్యార్థినుల సామర్థ్యాలను పరీక్షించారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం తదతర అంశాలపై ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి నిర్వాహకులకు సూచనలు చేశారు. అలాగే, యూనిఫాం కుడుతున్న వారితో మాట్లాడారు. సీఎంఓ బి.ప్రవీణ్కుమార్, సీఆర్టీలు సమీనా, ఝాన్సీ, ఉద్యోగులు పాల్గొన్నారు.
‘మేరా యువ భారత్’లో వలంటీర్ల నియామకం
ఖమ్మం రాపర్తినగర్: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన మేరా యువభారత్(మై భారత్)లో యువ వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో యువజన సంఘాల నిర్మాణం కోసం ఈ వలంటీర్లు కృషి చేయాల్సి ఉంటుందని మేరా యువ భారత్ అధికారి ఎం.వీ.రాంబాబు తెలిపారు. ప్రతీ గ్రామంలో యువజన సంఘాల ఏర్పాటుకు గాను 18 – 29ఏళ్ల వయసు కలిగి, కనీసం పదో తరగతి విద్యార్హత ఉండడమేకాక సామాజిక సేవపై ఆసక్తి ఉన్న వారు అర్హులని వెల్లడించారు. ఈనెల 20వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిౖకైన వారు గౌరవ వేతనంతో రెండేళ్లు వలంటీర్గా కొనసాగే అవకాశముందని తెలిపారు. వివరాలకు 91773 29258 నంబర్లో సంప్రదించాలని సూచించారు.
మిగిలిన సీట్ల భర్తీకి
రేపు కౌన్సెలింగ్
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతిలో మిగిలిన సీట్ల భర్తీకి శనివారం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఐదో తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు స్టడీ సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ పత్రం ఒరిజినల్స్, ఇతర పత్రాలతో రఘునాథపాలెంలోని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్(బాలుర)లో 18న ఉదయం 10గంటలకు మొదలయ్యే కౌన్సెలింగ్కు హాజరుకావాలని ఆర్సీఓ రాంబాబు సూచించారు.


