సత్తుపల్లిటౌన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన మున్సిపల్ శానిటేషన్ కార్మి కుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. సత్తుపల్లి మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ పద్ధతిపై గాంధీనగర్కు చెందిన ఇనుపనూరి గుమ్మడయ్య (55) పని చేస్తున్నాడు. ఈ నెల 1న ఉదయం రింగ్ సెంటర్ వద్ద పారిశుద్ధ్య పనులు చేస్తున్న ఆయనను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ మేరకు ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించగా పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. గత 30 ఏళ్లుగా పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, గుమ్మడయ్య మృతిపై మున్సిపల్ చైర్పర్సన్ ఎండీ రెహానా కమల్పాషా, కమిషనర్ నర్సింహ, ఉద్యోగులు, సిబ్బంది సంతాపం తెలిపారు.
కుటుంబ కలహాలతో బలవన్మరణం
కల్లూరురూరల్: కుటుంబ కలహాలు తట్టుకోలేక ఓ ఆశా కార్యకర్త ఆత్మహత్యకు పాల్పడింది. మండలంలోని రఘునాథగూడెంకు చెందిన జానపాటి శారద (45) ఆశాకార్యకర్తగా పనిచేస్తోంది. తోటి కోడలు ద్వారక, మరిది భాస్కర్రావుతో జరిగిన గొడవల కారణంగా మనస్తాపానికి గురైనన శారద.. ఎక్కువ సంఖ్యలో మాత్రలు మింగి అపస్మారక స్థితికి చేరగా, కల్లూరు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె బుధవారం సాయంత్రం మృతి చెందింది. ఘటనపై ఆమె భర్త రామారావు చేసిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యం మత్తులో గ్రామకార్యదర్శి?
కారేపల్లి: మండలంలోని గంగారంతండా గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటేశ్ బుధవారం ఉదయం మద్యం మత్తులో విధులకు హాజరైనట్లు తెలిసింది. ఇదేమిటని సర్పంచ్ కిరణ్, గ్రామస్తులు నిలదీయగా ఆయన తాను మద్యం తాగలేదని.. కావాలని ఆరోపణలు చేస్తున్నారని వాగ్వాదానికి దిగాడు. దీంతో సర్పంచ్, స్థానికులు ఆయనను కారేపల్లి పోలీస్స్టేషన్కు తీసుకెళ్లగా సిబ్బంది బ్రీత్ అనలైజర్ పరీక్ష చేశారు. సర్పంచ్ కిరణ్ ఘటనపై ఎంపీఓ మల్లేల రవీంద్రప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎంపీఓ మాట్లాడుతూ.. సర్పంచ్ ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని తెలిపారు.


