కొణిజర్ల: మండలంలోని అమ్మపాలెంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల పీఈటీ భాస్కర్ తమ కుమారుడిని చితకబాదడమే కాక ప్రిన్సిపాల్తో టీసీ ఇప్పించాడని బాలుడి తల్లిదండ్రులు, స్థానికులు ఆరోపించారు. ఈ మేరకు పాఠశాల వద్ద బుధవారం నిరసన తెలిపారు. కొణిజర్లకు చెందిన చింతల ఉదయ్కిరణ్ గురుకులంలో 9వ తరగతి చదువుతుండగా, క్రమశిక్షణ లేదని పీఈటీ భాస్కర్ ఇటీవల కర్రతో కొట్టగా వీపుపై వాతలు తేలాయి. ఈ సమయాన ఉదయ్కిరణ్, ఆయన సోదరుడు ఈశ్వర్ మణికంఠ అడ్డుకోబోగా ఇద్దరికి క్రమశిక్షణ లేదని టీసీలు ఇస్తున్నట్లు తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో బుధవారం ఉదయ్కిరణ్ తండ్రి ఎల్లిబాబు, గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకుడు సూరంపల్లి రామారావు ఆధ్వర్యాన పాఠశాలకు వచ్చి పీఈటీ భాస్కర్ను సస్పెండ్ చేయాలంటూ ఆందోళన చేపట్టారు. సుమారు 3 గంటల పాటు పాఠశాల ఎదుట బైఠాయించడంతో ప్రిన్సిపాల్ నాగమణి ఇచ్చిన సమాచారం మేరకు ఆర్సీఓ పాఠశాలకు చేరుకున్నారు. పీఈటీని కూసుమంచికి బదిలీ చేస్తున్నట్లు చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
స్థానికుల ఆందోళనతో బదిలీ


