ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ కోసం 45 ఆధార్ కిట్లు సమకూర్చినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సదానందం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రక్రియను బాత్రానిక్స్ సంస్థకు ప్రభుత్వం అప్పగించినందున సంస్థ బాధ్యులు ప్రతీ పాఠశాలకు వెళ్లి ఉచితంగా విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారని వెల్లడించారు. సెప్టెంబర్ వరకు ఉచితంగా చేయనుండగా, ఆ తర్వాత ప్రభుత్వం ధరలు నిర్ణయిస్తుందని తెలిపారు. ఈమేరకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ పరిధిలోని విద్యార్థుల బయోమెట్రిక్ అప్డేట్ చేయించడమే కాక సంస్థ బాధ్యులు నగదు వసూలు చేయకుండా పర్యవేక్షించాలని డీఈఓ సూచించారు.
● ఖమ్మం శాంతినగర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సాంఘికశాస్త్రం ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణ కొనసాగుతుండగా, డీఈఓ సదానందం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక, భౌగోళిక పరిస్థితులు, సమకాలీన అంశాలపై అవగాహన పెంపొందించుకుని విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలని సూచించారు. ఏఎంఓ పెసర ప్రభాకర్రెడ్డి, శిక్షణ కేంద్రం ఇన్చార్జి చల్లా రంగారెడ్డి, హెచ్ఎం కృపాబాలానందం, రిసోర్స్ పర్సన్లు పి.నరేష్, నవీన్కుమార్, బి.ప్రసాద్, నాగరాజు, సత్యనారాయణ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


