గ్రీవెన్స్ డేలో కలెక్టర్ దివాకర
ఖమ్మం సహకారనగర్: ప్రజలు అందించిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. సూచించారు. కలెక్టరేట్లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆయన ప్రజల నుంచి వినతిపత్రాలు, ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, ట్రెయినీ అసిస్టెంట్ కలెక్టర్ పారస్కుమార్ పాల్గొనగా వివిధ శాఖల అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
● కూసుమంచి మండలం పాలేరులో జనాభా ఆధారంగా రెండో రేషన్ షాపు కేటాయించాలని స్థానికులు వినతిపత్రం అందజేశారు.
● చింతకాని మండలం వందనం గ్రామానికి చెందిన అమర్లపూడి వసంతరాణి ఇంటర్ పూర్తిచేసిన తాను ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఆయా పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్నా, రాలేదని అర్హత ఆధారంగా ఇప్పించాలని కోరారు.
● తల్లాడ మండలం గొల్లగూడెంకు చెందిన జి.సురేష్ తన కుమారుడు సాత్విక్కు వైరా మహత్మా జ్యోతి బాపూలే స్కూల్లో సీటు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
● ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెంకు చెందిన డి.ఉపేంద్ర కంటిచూపు కోల్పోయిన తనకు దివ్యాంగుల పింఛన్ మంజూరు చేయాలని కోరారు.


