డీఎంహెచ్ఓ రామారావు
ఖమ్మంవైద్యవిభాగం: పిల్లల కడుపులో పెరిగే నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు పనిచేస్తాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి రామారావు తెలిపారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఖమ్మం నయాబజార్ పాఠశాలలో ఆయన పిల్లలతో ఆల్బెండజోల్ మాత్రలు మింగించాక మాట్లాడారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు భోజనానికి ముందు, మరుగుదొడ్డి ఉపయోగించాక చేతులు సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం, సురక్షితమైన తాగునీరు తీసుకోవడం వంటి జాగ్రత్తలతో నులిపురుగులు దరి చేరవని తెలిపారు. జిలాల్లో 1నుంచి 19ఏళ్ల వయస్సు పిల్లలు 2,87,579 మంది ఉండగా, సోమవారం 2,82,196 మంది(91శాతం) పిల్లలకు మాత్రలు పంపిణీ చేశామని చెప్పారు. మిగతా వారితో ఈనెల 20న మాత్రలు మింగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఉద్యోగులు డాక్టర్ ప్రతాప్ సంపత్కుమార్, డాక్టర్ లక్ష్మీనారాయణ, కే.వీ.రాజు, రమణ, డాక్టర్ దేవిశ్రీ, డాక్టర్ రవికుమార్, నాగమాధురి, జైపాల్, శారద, రామకృష్ణ, హెచ్ఎం ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.


