తిరుమలాయపాలెం: భూస్వామ్య పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ సుదీర్ఘ కాలం తన గళం ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని నింపిన ఘనత అరుణోదయ నాగన్నకు దక్కుతుందని న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిది జే.వీ.చలపతిరావు, కేంద్ర కమిటీ సభ్యుడు గాదె మాధవరెడ్డి తెలిపారు. ఇటీవల మృతి చెందిన నాగన్న సంస్మరణ సభ ఆయన స్వగ్రామమైన మండలంలోని రాజారంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని శ్రీపాద శ్రీహరి విగ్రహానికి నివాళులర్పించాక, నాగన్న స్తూపాన్ని ఆవిష్కరించారు. అనంతరం చలపతిరావు, మాధవరెడ్డి మాట్లాడుతూ నాగన్న 50 ఏళ్ల పాటు విప్లవోద్యమంలో ప్రజలకు నాయకత్వం వహించారని తెలిపారు. నాటి తరం అరుణోదయ కళాకారులు లేని లోటును యువ కళాకారులు తీర్చాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవునూరు మధు మాట్లాడగా తొలుత కళాకారులు డప్పు నృత్యాలు, పాటలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పార్టీ నాయకుడు మందుల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన జరిగిన సభలో వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు గాదె ఝాన్సీ, ఏనుగుల చంద్రారెడ్డి, బండారి ఐలయ్య, మందుల అరుణ, పరకాల లక్ష్మి, అజయ్, ఉదయగిరి, పోలేపొంగు నాగయ్య, వేణు, విప్లవ కుమార్, గొర్రెపాటి రమేష్, ప్రకాష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సంస్మరణ సభలో ఎన్డీ రాష్ట్ర అధికార ప్రతినిధి చలపతిరావు


