సత్తుపల్లిటౌన్: విద్యార్థులకు గురువులే మార్గదర్శకులని.. చిన్నతనం నుంచే విలువలతో కూడిన విద్య అందిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని హైదరాబాద్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి బోధమయానంద మహరాజ్ సూచించారు. శ్రీరామకృష్ణ వివేకానంద యువ ప్రచార పరిషత్, సత్తుపల్లి శ్రీరామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యాన డివిజన్లోని ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులకు శనివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో బోధమయానంద మాట్లాడుతూ.. విద్యార్థుల్లో క్రమశిక్షణ, నైతిక, మానవీయ విలువలు పెంపొందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకుంటూ బోధనా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. అనంతరం మైసూర్ రామకృష్ణ మఠం అధ్యక్షుడు స్వామి మహామేధానంద మహరాజ్, విజయవాడ రామకృష్ణ మిషన్ ఉప కార్యదర్శి స్వామి శితికంఠనంద మహరాజ్ మాట్లాడారు. ఆ తర్వాత సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ.. గురువును గౌరవించడమంటే సమాజాన్ని గౌరవించినట్టేని తెలిపారు. ఇంత గొప్ప ఘనత కలిగిన ఉపాధ్యాయులు నిరంతరం నేర్చుకుంటూ పిల్లలకు ప్రేమతో బోధిస్తూ వారి లక్ష్యసాధనలో పాలు పంచుకోవాలని చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ ఎండీ రెహానాబేగం, మార్కెట్ చైర్మన్ దోమ ఆనంద్, ఎంఈఓ రాజేశ్వరరావుతో పాటు చీకటి శ్రీనివాసరావు, చల్లగుండ్ల శ్రీనివాసరావు, గట్టే వాసు, యోగా అప్పారావు, నాయుడు వెంకటేశ్వరరావు, పి.నాగేశ్వరరావు, ఎం.ప్రభాకర్రెడ్డి, ఒగ్గు భగవాన్రెడ్డి, ఇస్మాయిల్, పులి శ్రీనివాసరావు, మురళీకృష్ణ, లింగారెడ్డి, వంశీకృష్ణ, కిరణ్కుమార్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణ మఠం అధ్యక్షుడు
స్వామి బోధమయానంద


