ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్రం, దేశంలోనే కాక అంతర్జాతీయంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను లోతైన అధ్యయనం, వర్గ విశ్లేషణతో అర్థం చేసుకోవడమేకాక శాసీ్త్రయ దృక్పథం పెంచుకుంటే సమాజ మార్పునకు అడుగులు పడతాయని డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్ అన్నారు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో జరిగిన సీపీఎం జిల్లా శాఖల సభ్యుల శిక్షణా తరగతులను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, కార్పొరేట్ అనుకూల విధానాలు, కార్మిక చట్టాల నిర్వీర్యం వంటి సమస్యలపై అధ్యయనం చేయకుండా పరిష్కారం సాధ్యం కాదన్నారు. అంతేకాక సమస్యల నుంచి దారి మళ్లించేలా జరుగుతున్న కుల, మత రాజకీయాల స్వభావాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు మాట్లాడుతూ.. ప్రభుత్వాల ప్రచారాన్ని నమ్మకుండా గణాంకాలు, విధానాలను పరిశీలిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని తెలిపారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పెట్టుబడిదారీ సమాజానికి ఆఖరి ఘడియలు సమీపించగా, భవిష్యత్ కమ్యూనిస్టుల వైపునకు మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు, పలు వర్గాల ప్రముఖులు కల్యాణం వెంకటేశ్వరరావు, ఎల్వీ రావు, బోడపట్ల రవీందర్, మల్లెంపాటి వీరభద్రం, బండారు రమేశ్, పారుపల్లి ఝాన్సీ, బి.రాజేశ్వరరావు, వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


