● పంటలు ఎండుతున్నాయని రైతుల ఆవేదన ● వారబందీ సరిగ్గా అమలుకాక ఇక్కట్లు
ముదిగొండ: ముదిగొండ మండలంలోని రైతులు అత్యధికంగా సాగర్ జలాలపైనే ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. అయితే, సాగర్ నీటి విడుదలలో వారబందీ విధానం అమలవుతుండగా సక్రమంగా నీరు అందడం లేదని రైతులు వాపోతున్నారు. మండలంలో ఎక్కువ మంది రైతులు వరి, మొక్కజొన్న పండిస్తున్నారు. వారబందీ విధానంలో లోపాలతో ఆయా పంటలు ఎండిపోతున్నాయనే ఆవేదన వ్యక్తమవుతోంది.
చివరి భూముల్లోనూ కాదు..
బావులు, చెరువులు పంటల సాగు కొంతమేర ఆశాజనకంగా ఉంది. అయితే, సాగర్ డ్యాంలో సమృద్ధిగా నీరు ఉందనే ఆశతో ఆయకట్టులో పంటలు సాగు చేసిన రైతుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారింది. ముదిగొండ మండలంలోని పలు గ్రామాలకు గుదిమళ్ల, మంగాపురం మేజర్ కాల్వల ద్వారా నీరు చేరాలి. కానీ వారబందీ విధానంలో లోపాలతో చివరి భూములకు నీరు అందక.. కొన్నిచోట్ల మధ్యలో భూములకు సైతం నీరు చేరక ఇబ్బంది పడుతున్నారు. ఎన్నెస్పీ అధికారులు వారబందీ విధానాన్ని విస్మరించి రెండు వారాలకోసారు నీరు విడుదల చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా మధ్య, చివరి భూములకు అందక పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే సాగర్ కాల్వ ఉన్నా చుక్క నీరు అందక ఈ పరిస్థితి నెలకొన్నందున అధికారులు స్పందించి వారబందీ విధానమైనా సక్రమంగా అమలుచేసి చేతికొచ్చే దశలో ఉన్న పంటలను కాపాడాలని రైతులు కోరుతున్నారు.


