ముదిగొండ: కుటుంబ కలహాలతో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నిస్తుండగా.. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించిన ఆమెను కాపాడారు. ఖమ్మం పాతబస్టాండ్ సమీపంలో నివాసముండే కొరివి శైలజ కుటుంబ కలహాలు కారణంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఖమ్మం–కోదాడ జాతీయ రహదారిపైకి మంగళవారం చేరుకున్న ఆమె ముదిగొండ మండలం గోకినేపల్లి బ్రిడ్జి పైనుంచి దూకేందుకు సిద్ధమైంది. అదే సమయాన పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది గుర్తించి ఆమెను కాపాడి స్టేషన్కు తీసుకెళ్లారు. సీఐ ఓ మురళి ఆదేశాల మేరకు అక్కడ కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులను పిలిపించారు. ఆపై శైలజను ఆమె కుమార్తె స్పందనకు ఎస్సై కృష్ణప్రసాద్ అప్పగించగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, పోలీసు సిబ్బందిని పలువురు అభినందించారు.


