ఏన్కూరు: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలాలను కలిపే నాచారం రోడ్డుకు మహర్దశ పడుతోంది. సుమారు 12 కి.మీ. దూరం సింగిల్ రోడ్డుగా ఉన్న ఈ రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.43 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో రహదారిని విస్తరించడమే కాక సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ రహదారి మీదుగా రేపల్లెవాడ, మేడేపల్లి, గంగుల నాచా రం, కాలనీ నాచారం, భద్రుధ్రుతండా, మునియతండా, ఒంటిగుడిసె తదితర గ్రామాలకు ప్రజలు రాకపోకలు కొనసాగిస్తారు. నాచారం – రేపల్లెవాడ మధ్య ఉన్న వాగు వర్షాకాలంలో పొంగితే రాకపోకలు నిలిచిపోతున్నాయి. ప్రస్తుతం నాలుగు లేన్లుగా విస్తరణలో భాగంగా లోలెవల్ వంతెన స్థానాన హై లెవల్ వంతెన నిర్మిస్తే ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అంతేకాక నాచారంలో ప్రసిద్ధి చెందిన శ్రీ అద్భుత వెంకటేశ్వరస్వామి ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు వస్తూ ఉంటారు. రహదారి అభివృద్ధితో భక్తుల రాకపోకలు సులువు కానున్నాయి. రెండు జిల్లాల ప్రజలకు ఉపయోగంగా ఉండే ఈ రహదారి నిర్మాణానికి ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ నిధులు మంజూరు చేయించగా, త్వరలో పనులు మొదలుకానున్నాయి.
రూ.43 కోట్లతో నాలుగు లేన్లుగా విస్తరణ


