ఏ ఒక్కరితోనే తెలంగాణ రాలేదు..
● రామదాసు బాటలో పోరాటంతో స్వరాష్ట్రం ● టీజేఎస్ వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరామ్
నేలకొండపల్లి: తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి పోరాటంతోనే రాలేదని, అమరువీరుల త్యాగాలతో సాధ్యమైందని తెలంగాణ జన సమితి వ్యవస్థాపకులు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. నేలకొండపల్లిలో గురువారం జరిగిన పాలేరు డివిజన్ స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం ఎందరో అమరులయ్యారని తెలిపారు. కానీ ఏ ఒక్కరి పోరాటంతోనే తెలంగాణ వచ్చిందని భావిస్తే పొరపాటని చెప్పారు. రాముడికి ఆలయం కట్టాలని ఆనాడు భక్తరామదాసు తెగిస్తే.. ఆయన వారసత్వంతో తెలంగాణ కోసం ప్రజలు పోరాడారని, రామదాసు బాటలో అప్పటి పాలకులను నిలదీసి స్వరాష్ట్రం సాధించుకున్నామని తెలిపారు. అమరువీరులంతా చనిపోయే ముందు కుటుంబాలను కాకుండా తెలంగాణ ఆకాంక్షనే వ్యక్తం చేశారని చెప్పారు. కాగా, ఉద్యమకారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని కోరిన ఆయన ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించిందని తెలిపారు. ఇక తెలంగాణ వచ్చాక తాము ప్రజాసమస్యలపై పోరాడితే కేసులు పెట్టడమే కాక, కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్ట్లు డిజైన్ చేశారని విమర్శించారు. రాష్ట్ర రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడుతున్న నేపథ్యాన ప్రభుత్వం స్పందించేలా మంత్రులను కలుస్తామని కోదండరామ్ తెలిపారు. కాగా, నేలకొండపల్లి పర్యటనలో భాగంగా కోదండరామ్ భక్తరామదాసు ధ్యాన మందిరంలో పూజలు చేశాక రామదాసు కాంస్య విగ్రహం వద్ద నివాళులర్పించారు. మందిరం చరిత్రను పూజారి సౌమిత్రి రమేష్ వివరించడంతో పాటు ఇక్కడ మ్యూజియం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అంతే కాకుండా ఇంకా అభివృద్ధి చేయాలని సంబంధిత మంత్రులను కలవనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, నాయకులు పల్లె వినయ్కుమార్, కె.రవి, మాదాసు శ్రీనివాసరావు, బెల్లంకొండ నాగేశ్వరరావు, తీగ రాములు, రవీందర్నాయక్ , సైదులు తదితరులు పాల్గొన్నారు.
సుబ్లేడు మండల కేంద్రం కోసం వినతి
తిరుమలాయపాలెం: ఏళ్లుగా సుబ్లేడు మండలం ఏర్పాటు చేయాలని కోరుతున్న నేపథ్యాన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మండల సాధన కమిటీ సభ్యులు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోదండరామ్కు వినతిపత్రం అందజేశారు. మాజీ సర్పంచ్ భూక్య వీరన్నతో పాటు గండమల్ల సుందర్రావు, కంచం వీరన్న, మెట్టు ఆంజనేయులు, మెట్టు వెంకన్న, గంధసిరి సత్యం, పోలే పొంగు బాలరాజు, రేఖ్యా, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


