● యాసంగిలో ఈ పంటకే రైతుల ప్రాధాన్యత ● కొన్నిచోట్ల పత్త
ఐదు వేల ఎకరాలకు పైగా మొక్కజొన్న సాగైన మండలాల వివరాలు
ఆశాజనకంగా పంట సాగు
ఖమ్మంవ్యవసాయం: మొక్కజొన్న సాగుకు జిల్లా రైతులు మొగ్గు చూపుతుండడంతో యాసంగిలో విస్తీర్ణం పెరిగింది. మునుపెన్నడూ లేని విధంగా ఈ ఏడాది విస్తీర్ణం గణనీయంగా పెరగడం విశేషం. సాధారణ పెట్టుబడితో యాసంగి కాలానికి అనుకూలమైన పంటగా పేరుండడంతో కొన్నేళ్లుగా నీటి వనరుల ఆధారంగా రైతులు మొక్కజొన్న సాగు చేస్తున్నారు. జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం ఆధారంగా యాసంగిలో వారబందీ పద్ధతుల్లో నీరు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యాన వానాకాలం పత్తి సాగు చేసిన భూముల్లో యాసంగి పంటగా మొక్కజొన్నకు అవకాశం ఉండగా, చివరి ఆయకట్టు భూముల్లోని వరి మాగాణుల్లో కూడా ఇదే పంట ఎంచుకుంటున్నారు. గతంలో 80 వేల నుంచి 90 వేల ఎకరాల వరకు సాగయ్యే మొక్కజొన్న గత ఏడాది 1.22 లక్షల ఎకరాలకు చేరింది. ఈసారి మరో 43 వేల ఎకరాలు పెరగడం విశేషం. అత్యధికంగా చింతకాని, కొణిజర్ల, బోనకల్, ముదిగొండ, రఘునాథపాలెం, ఏన్కూరు మండలాల్లో మక్క పంట సాగు చేస్తున్నారు.
నికర ఆదాయం గ్యారంటీ..
జిల్లాలో ఈ ఏడాది యాసంగి పంటగా 1,65,463 ఎకరాల్లో మొక్కజొన్న సాగవుతోంది. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం వస్తుండడంతో రైతులు ఈ పంట ఎంచుకుంటున్నారు. మొక్కజొన్న ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి అవుతుండగా ఎకరాకు 35 – 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న క్వింటాకు కనీస మద్దతు ధర రూ.2,400గా నిర్ణయించినందున ఎకరంలో సాగు చేస్తే రూ.96 వేల ఆదాయం వస్తుంది. ఖర్చులు పోగా సుమారు రూ.80 వేల ఆదాయం నికరంగా వస్తుండడంతో రైతులు మొగ్గు చూపుతున్నారు.
నష్టాలతో ఇటు చూపు
ఈ ఏడాది వానాకాలంలో అధిక వర్షాలకు పత్తి దెబ్బతిన్నది. దీంతో అరకొరగా పండిన పంటను రెండు తీతల్లో తీసి తొలగించాక పలువురు మొక్కజొన్న వేశారు. అలాగే, మిర్చి తోటలు దెబ్బత్ని చోట కూడా రైతులు తోటలు తొలగించి మొక్కజొన్న వేయడం.. సాగర్ నుంచి నీరు విడుదల చేస్తుండడంతో ఈ ఏడాది మొక్కజొన్న సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
మండలం గత ఏడాది ఈ ఏడాది
చింతకాని 26,072.13 28,351
కొణిజర్ల 18,106.12 20,431
బోనకల్ 17,476.10 19,105
ముదిగొండ 14,331,38 14,560
రఘునాథపాలెం 4,147.10 13,649
ఏన్కూరు 3,703.29 10,214
ఎర్రుపాలెం 5,051.12 7,848
తల్లాడ 2,807.19 7,565
ఖమ్మంరూరల్ 5,546.32 5,640
కామేపల్లి 1,245.30 5,212
కూసుమంచి 2,791.15 5,078
ఏపుగా పెరుగుతున్న మొక్కజొన్న పైరు
(ఇన్సెట్) కంకి దశలో ఉన్న మొక్కజొన్న
జిల్లాలో యాసంగి పంటగా మొక్కజొన్న ఆశాజనకంగా ఉంది. గతంతో పోలిస్తే ఈ ఏడాది జిల్లాలో విస్తారంగా సాగు చేస్తున్నారు. పలుచోట్ల పంట ప్రస్తుతం కంకి దశలో ఉంది. నీరు సమృద్ధిగా ఉండటంతో దిగుబడి కూడా మెరుగ్గా నమోదయ్యే అవకాశం ఉంది. –ధనసరి పుల్లయ్య,
జిల్లా వ్యవసాయాధికారి
● యాసంగిలో ఈ పంటకే రైతుల ప్రాధాన్యత ● కొన్నిచోట్ల పత్త
● యాసంగిలో ఈ పంటకే రైతుల ప్రాధాన్యత ● కొన్నిచోట్ల పత్త


