అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి
ఖమ్మంమామ్లిగూడెం: ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు రాజకీయ నేతల ప్రయోజనాల కోసం పనిచేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు అని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు, జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు అన్నారు. ఈ మేరకు అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని గురువారం అదనపు కలెక్టర్కు వారు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. నాయకులు దొంగల సత్యనారాయణ, నున్నా రవి, గుత్తా వెంకటేశ్వరరావు, నల్లగట్టు ప్రవీణ్కుమార్, వీరెల్లి రాజేశ్, రవిరాథోడ్, అల్లిక అంజయ్య, దొడ్డ అరుణ, రవిగౌడ్, కొణతం లక్ష్మీనారాయణ, బోయినపల్లి సురేశ్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ఆస్పత్రికి పార్థివదేహం
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం బేతుపల్లికి చెందిన నల్లమోతు వెంకమ్మ (82) బుధవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఆమె ముందుగానే చేసిన సూచన మేరకు వెంకమ్మ మృతదేహాన్ని కుమార్తెలు బొంతు అనసూర్య, తన్నీరు పుష్పావతి నార్కెట్పల్లిలోని కిమ్స్ ఆస్పత్రికి అందించారు. వైద్య విద్యార్థుల బోధన కోసం తల్లి పార్థీవదేహాన్ని అందించిన వారిని సర్పంచ్ దొడ్డా రాజేంద్రప్రసాద్(అమ్ములు) తదితరులు అభినందించారు.
ప్రతీ విద్యార్థికి తర్ఫీదు ఇవ్వాలి
కూసుమంచి: ఎవ్రీ చైల్డ్ రీడ్ (ఈసీఆర్)లో భాగంగా ప్రతీ విద్యార్థికి ఆంగ్లంలో చదవడం, రాయడం వచ్చేలా తర్ఫీదు ఇవ్వాలని జిల్లా పరిషత్ సీఈఓ దీక్షారైనా సూచించారు. మండలంలోని జీళ్లచెరువు, చేగొమ్మ పాఠశాలలను గురువారం తనిఖీ చేసిన ఆమె విద్యార్థుల పఠనా సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం సీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు ఈసీఆర్పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ప్రతీ విద్యార్థిలో సామర్థ్యాలు పెరిగేలా బోధన కొనసాగాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎంఓ ప్రవీణ్కుమార్, ఎంపీడీఓ జశ్వంత్కుమార్, ఎంవీఓ వీరస్వామి, ఎంపీఓ రాజారాం, సీఆర్పీలు వెంకటేశ్వర్లు, జాఫర్ పాల్గొన్నారు.
మహిళ అప్పగింత
ఖమ్మంఅర్బన్: మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్న ఓ మహిళను చేరదీసి ఆమె భర్తకు అప్పగించినట్లు అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు. ఖమ్మం రైల్వేస్టేషన్లో తిరుగుతున్న 35 ఏళ్ల మహిళను జీఆర్పీ పోలీసులు గుర్తించి ఆశ్రమానికి అప్పగించారు. ఆమెకు వైద్యం చేయించడంతో కోలుకోగా తన పేరు సావిత్రి అని, తమది ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లా బలిజేపల్లి గ్రామంగా వెల్లడింది. దీంతో అక్కడి పోలీసుల ద్వారా ఆమె కుటుంబీకులకు సమాచారం ఇవ్వగా సావిత్రి భర్త చంద్రశేఖర్ ఖమ్మం వచ్చాడు. ఇటీవలే ఇంటి నుంచి తప్పిపోయిన ఆమె కోసం గాలిస్తుండగా అప్పగించడంపై కృతజ్ఞతలు తెలిపారు.
మృతుడి ఆచూకీ గుర్తింపు
ఖమ్మంక్రైం: ఖమ్మం టేకులపల్లిలోని ఎన్నెస్పీ కాల్వలో బుధవారం లభించిన మృతదేహం ఆచూకీని గుర్తించారు. మృతదేహం కై కొండాయిగూడెంనకు చెందిన బానోతు కృష్ణ (55)దిగా తేలింది. మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న ఆయన ప్రమాదవశాత్తు కాల్వలో పడి ఉండొచ్చని భావిస్తున్నారు. కృష్ణ భార్య లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఖమ్మం టూ టౌన్ పోలీసులు తెలిపారు.
బిల్లింగ్ విధానంపై
అవగాహన
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని హెచ్టీ, ఎల్టీ విద్యుత్ వినియోగదారులకు బిల్లింగ్ విధానంపై గురువారం ఖమ్మంలోని విద్యుత్ గెస్ట్హౌస్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఈ బాలాజీ మాట్లాడుతూ కిలోవాట్ హవర్(కేడబ్ల్యూహెచ్) నుంచి మారిన కిలోవాట్ యాంపియర్ హవర్(కేవీఏహెచ్) విధానంలో బిల్లులు తగ్గించుకునేందుకు ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ కంట్రోలర్ ప్యానెళ్లు అమర్చుకోవాలని సూచించారు. తద్వారా బ్లాకింగ్ లేదా జరిమానాను నివారించవచ్చని తెలిపారు. అనంతరం వినియోగదారులు సందేహాలను ఎస్ఈ శ్రీనివాసాచారి నివృత్తి చేశారు. ఎస్ఏఓ శ్రీధర్, డీఈలు బాబూరావు, రామారావు, నాగేశ్వరరావు, రమేష్, వెంకటేశ్వర్లుతో పాటు ఏడీఈలు, ఏఏఓలు పాల్గొన్నారు.
నిబంధనలు పాటించని ఆస్పత్రులపై చర్యలు
కూసుమంచి: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఆస్పత్రుల బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని డీఎంహెచ్ఓ రామారావు హెచ్చరించారు. కూసుమంచిలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులను గురువారం తనిఖీ చేసిన ఆయన రికార్డులు ల్యాబ్లను పరిశీలించాక ఆయన మాట్లాడారు. మెడికల్ ఆఫీసర్లు సాయికుమార్, లక్ష్మీ లోహిత పాల్గొన్నారు.
అధికార దుర్వినియోగంపై చర్యలు తీసుకోండి


