
ఐటీఐలో రేపు ప్లేస్మెంట్ డ్రైవ్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం టేకులపల్లిలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శుక్రవారం ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్ ద్వారా కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యాన రిజిస్టర్డ్ అయిన ఏజన్సీల బాధ్యలు పాల్గొని ప్లేస్మెంట్లు కల్పిస్తారని పేర్కొన్నారు. ఈమేరకు 18నుంచి 40 ఏళ్లలోపు అభ్యర్థులు ఉదయం పది గంటలకు మొదలయ్యే డ్రైవ్కు హాజరుకావాలని సూచించారు.
ఖమ్మం కొత్త, పాత బస్టాండ్లలో ఆర్ఎం తనిఖీ
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంలోని ఆర్టీసీ కొత్త, పాత బస్టాండ్లలో హోటళ్లు, షాపులను రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ బుధవారం తనిఖీ చేశారు. కొత్త బస్టాండ్లోని హోటల్లో ఆహార పదార్థాలు, కిచెన్ను పరిశీలించి తాగునీటి బాటిళ్ల ధరపై ఆరా తీశారు. హోటళ్ల నిర్వాహకులు పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. అపరిశుభ్రంగా ఉన్నా, తాగునీటి బాటిళ్లు అధిక ధరలకు విక్రయించినా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, బస్టాండ్లలోని వాటర్ కూలర్లను శుభ్రం చేయించాలని డీఎం దినేష్కుమార్ను ఆదేశించారు.
యంగ్ ఇండియా
ఇంటర్నేషనల్ స్కూల్కు
స్థల పరిశీలన
బోనకల్: బోనకల్ మండలం లక్ష్మీపురం గ్రామంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్కు కేటాయించాలని స్థలాన్ని ఉన్నతాధికారులు బుధవారం పరిశీలించారు. తెలంగాణ ఎడ్యుకేషన్, వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఎండీ గణపతిరెడ్డి, ఇంజనీర్లు షఫీమియా, విన్సెంట్రావు స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. లక్ష్మీపురం రెవెన్యూ పరిధి సర్వేనంబర్ 401లో గుర్తించిన 30ఎకరాల స్థలం స్కూల్ నిర్మాణానికి అనువుగా ఉందని పేర్కొన్నారు. త్వరలోనే పాఠశాల నిర్మాణ పనులు మొదలవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ పున్నం చందర్, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఏజెంట్ల వద్ద సైతం
తలంబ్రాల బుకింగ్
ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ తలంబ్రాలు కావాల్సిన భక్తులు ఖమ్మం డిపో పరిధిలోని ఆర్టీసీ కార్గో ఏజెంట్ల వద్ద బుక్ చేసుకోవచ్చని డిపో మేనేజర్ దినేష్కుమార్ తెలిపారు. ఈసందర్భంగా ఖమ్మం కొత్త బస్టాండ్లో బుధవారం కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. స్వామి వారి తలంబ్రాలను ఇంటి వద్దే అందించనుండగా, ఖమ్మం మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్(91542 98583), ఖమ్మం పాతబస్టాండ్ ఏజెంట్(97043 45599), కొణిజర్ల ఏజెంట్(85220 12587), నేలకొండపల్లి ఏజెంట్ 83310 06959, బోనకల్ ఏజెంట్(83091 25037)ను సంప్రదించాలని సూచించారు.
మత్స్యకారులకు ముగిసిన శిక్షణ
కూసుమంచి: మండలంలోని పాలేరులో పీ.వీ.నర్సింహారావు మత్స్య పరిశోధనా కేంద్రంలో ములుగు జిల్లాకు చెందిన మత్స్యకారులకు ఇస్తున్న మూడు రోజుల శిక్షణ బుధవారం ముగిసింది. చివరి రోజు క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా నల్లగొండలో పనామి రొయ్యల పెంపకాన్ని పరిశీలించారు. ఆతర్వాత హైదరాబాద్లోని మత్స్య అభివృద్ధి మండలిని సందర్శించి అక్కడ మత్స్యరైతులకు కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలను తెలుసుకున్నారు. పాలేరు పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్యాంప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

ఐటీఐలో రేపు ప్లేస్మెంట్ డ్రైవ్