● ఇంకుడు గుంతలు, డ్రెయిన్ల నిర్మాణానికి చర్యలు ● కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మంమయూరిసెంటర్: రానున్న పది రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణతో ఉపాధి హామీ పనులు చేపట్టాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద కేటాయించిన పనుల లక్ష్యాలను చేరేందుకు కృషి చేయాలని తెలిపారు. అటవీ ప్రాంతాల్లో ట్రెంచ్, ఫీల్డ్ చానల్స్, చెరువు కాల్వల పూడిక తీత పనులను ప్రత్యేక డ్రైవ్గా చేపట్టాలన్నారు. అటవీ భూములకు బౌండరీ ట్రెంచ్లు ఏర్పాటు చేయడం ద్వారా ఉపాధి హామీ కూలీలకు పని లభించడమే కాక భూముల సంరక్షణ సాధ్యమవుతుందని చెప్పారు. అంతేకాక వ్యవసాయ శాఖ ద్వారా కొత్త పంట కాల్వలు, ఫామ్ పాండ్ల నిర్మాణానికి ప్రతిపాదిస్తే 24 గంటల్లో పనులు ప్రారంభించేందుకు అవకాశముందన్నారు. భూగర్భ జలాలు తగ్గిపోతున్న ఖమ్మం రూరల్, కూసుమంచి, నేలకొండపల్లి తిరుమలాయపాలెం, వైరా, ఏన్కూర్, సింగరేణి మండలాల్లో 15 చొప్పున రెయిన్ హార్వెస్టింగ్ పిట్లు ఏర్పాటు చేయాలని, ఆసక్తి ఉన్న రైతుల పొలాల్లో మండలానికి కనీసం 5 ఫామ్ పాండ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. నిధులు అందుబాటులో ఉన్న గ్రామపంచాయతీలలో సామాజిక ఇంకుడు గుంతలు, డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలని కలెక్టర్ సూచించారు. కాగా, తిరుమలాయపాలెం మండలంలో గతంలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదైనందున ఈసారి పునరావృతం కాకుండా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాలని తెలిపారు. అసిస్టెంట్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, డీఆర్వో ఏ.పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఏఓ డి.పుల్లయ్య, పీఆర్ ఈఈ వెంకట్రెడ్డి, డీఎల్పీఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.