శివాజీనగర: కొత్త కార్యక్రమాలతో పాటు పాత పథకాలను, పంచ గ్యారంటీలను కొనసాగించాలి. 100 రోజులు అనేది వేడుక కాదు, మనం సరైన మార్గంలో ఉన్నామని ప్రజలకు చూపిస్తున్నాము అని మాజీ సీఎం సిద్దరామయ్య అన్నారు. ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నూరు రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం విధానసౌధలో ఆర్భాటంగా దృఢ కర్ణాటక సంకల్పం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యమని సీఎం డీకే శివకుమార్ తెలిపారు. ఇల్లులేనివారికి ఉచితంగా స్థలం, సైనిక్ సమ్మాన్ పథకం, వివిధ ప్రభుత్వ శాఖల సేవలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే సేవ, పాఠశాలల కోసం సీఎస్ఆర్ వెబ్సైట్, విద్యార్థులకు ఉచిత బస్పాస్లు, వన్ కర్ణాటక మొబిలిటీ యాప్ను సీఎం డీకే, సిద్దరామయ్యలు ఆవిష్కరించారు. వందరోజుల్లో తమ సర్కారు ఏమేం చేసిందో వివరిస్తూ బ్రోచరును విడుదల చేశారు.
గ్యారంటీలను కొనసాగించాలి: సిద్దు
సిద్దరామయ్య ప్రసంగిస్తూ సెప్టెంబర్ 14కు కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 3 సంవత్సరాల 4 నెలలు పూర్తవుతుందన్నారు. మనవద్ద కొత్త ఆలోచనలు, కార్యక్రమాలు ఉన్నాయి. ప్రభుత్వం సరైన పనే చేస్తోంది. పంచ గ్యారెంటీలను కొనసాగించండి.. అని సిద్దరామయ్య సూచించారు. బీజేపీ నేత పాదయాత్రను ప్రస్తావిస్తూ ఆ పార్టీ జిమ్మిక్కులు చేస్తోందన్నారు. వర్షాలు పడే అవకాశాలు తక్కువని, కరువు కోరల్లో చిక్కిన రైతాంగాన్ని సత్వరమే ఆదుకోవాలని సీఎంకు సూచించారు.
సీఎం డీకే శివకుమార్
సరైన దారిలో సర్కారు: సిద్దు
విధానసౌధలో ఆర్భాటంగా
సీఎం డీకే 100 రోజుల సంబరం


