హొసపేటె: ఈసారి రుతుపవన వర్షాలు సరిగా కురవక పోవడంతో విజయనగర జిల్లా హడగలి తాలూకా కెంచమ్మనహళ్లి గ్రామానికి చెందిన రైతు బసవలింగప్ప తన ఉల్లి పంటను కాపాడుకోవడానికి ట్యాంకరు నీటిని ఆశ్రయించారు. జెస్కాం అధికారులు సరైన విద్యుత్ను అందించకపోవడంతో గ్రామంలోని బోరుబావులు ఎండిపోతున్నాయి. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి ట్యాంకర్ల నీటిని వాడుతున్నారు. రైతు బసవలింగప్ప మాట్లాడుతూ ఉల్లికి ప్రస్తుతం మంచి ధర ఉండగా, వర్షాలు చేయి ఇవ్వడంతో చేతికి వచ్చిన పంట ఎండిపోయి నష్టం వచ్చిందన్నారు. తాను రూ.2 లక్షలు అప్పు తీసుకుని 4 ఎకరాల్లో ఉల్లి సాగు చేశాను. కానీ నారు మొక్కలు రాగానే బోరుబావిలోని నీరు నిలిచి పోయి ఎండిపోతోందన్నారు.
రోజూ 15 ట్యాంకర్ల నీరందిస్తున్నాం
నా ఆస్తులన్ని తాకట్టు పెట్టి, పంటను కాపాడటానికి ప్రతి రోజూ పంటకు 15 ట్యాంకర్ల నీటిని అందిస్తున్నామని అన్నారు. ఒక్కొక్క ట్యాంకర్కు రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తున్నామని అన్నారు. రైతుల కష్టాలను చూడటానికి ఏ ఎమ్మెల్యే కానీ, అధికారులు కానీ పొలాలకు రావడం లేదు. బదులుగా వారు కార్యాలయాల్లో కూర్చుని నివేదికలు తయారు చేస్తున్నారు. పంట సర్వే నిర్వహించి, పంట నష్టపోయిన వారికి కనీసం ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలని జిల్లాధికారిని డిమాండ్ చేశారు. కాగా ఉల్లి రైతుల సంఘం రాష్ట్ర విభాగం అధ్యక్షుడు సిద్దేశ్ ఉత్తంగి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల జీవితాలతో చెలగాటం ఆడటం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు రైతులకు అండగా నిలిచి ఆదుకోవాలని డిమాండ్ వేశారు.
ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా ఉల్లి పంటకు నీరందిస్తున్న రైతు
ట్యాంకర్కు రూ.వెయ్యి ఖర్చుతో పంటను కాపాడుతున్న వైనం


