రాయచూరు రూరల్: రాయచూరులోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో ఆదివారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. లింగసూగురు తాలుకా జనతా పూరి సర్కారీ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు మౌనేషా చారి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును జిల్లా ఇన్చార్జ్ మంత్రి అజయ్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు. విజయనగరం జిల్లా హర్పన హళ్లి తాలుకా బెన్నహళ్లికి చెందిన మౌనేషా చారి విద్యాభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. పాఠశాలను బలోపేతం చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించారు. ఈయన సేవలను గుర్తించిన అధికారులు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక చేశారు.
దుండగులను శిక్షించాలి
రాయచూరు రూరల్: సిరవార తాలూకా హోక్రాని గ్రామంలో మలవిసర్జనకు వెళ్లిన అశ్విని అనే యువతిపై అత్యాచారం చేసి చంపేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని దళిత సేన డిమాండ్ చేసింది. ఆదివారం టిప్పు సుల్తాన్ ఉద్యాన వనంలో ఆ సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సినీ తారలు పూజా రమేష్, సంగీత దర్శకుడు మనోహర్ మద్దతు ఇచ్చారు. పోలీసులు ఈ కేసును నిస్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు. అశ్విని మృతదేహాన్ని బావిలో పడేసిన వారిపై కేసు నమోదు చేసి శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల జిల్లాలో దళిత యువతులు, మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయన్నారు. భూమానంద, రేణుక, రమే్ష్ మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
పల్లకీలో ఊరేగిన శ్రీకృష్ణుడు
రాయచూరు రూరల్: శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నగరంలో శ్రీకృష్ణుడి పల్లకీ ఉత్సవాలు వేడుకగా జరిగాయి. మహిళ సమాజ్ భక్తులు శ్రీకృష్ణుడి ప్రతిమ పల్లకీలో కొలువుదీర్చీ ప్రధాన వీధుల్లో ఊరేగించారు. దారి పొడవునా భక్తులకు త్రైత సిద్దాంత భగవద్గీత పుస్తకాలు పంపిణీ చేశారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు. కార్యక్రమంలో ఆదికర్త ఆచార్య ప్రభోదాంనద యోగీశ్వరులు, ఆయుర్వేద పతంజలి సంచాలకుడు సురేష్ తదితరులు పాల్గొన్నారు.
ప్రవచనాలతో
మానసిక ప్రశాంతత
రాయచూరు రూరల్: సమాజంలో మానవుడు సంస్కారంతో జీవించే విధంగా తన జీవన విధానం మార్చుకోవాలని కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు అభిప్రాయపడ్డారు. ఆదివారం కిల్లే బ్రహన్మఠంలో నెలరోజుల పాటు నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ప్రవచన పఠన కార్యక్రమంలో భాగంగా జంగమ వటువులకు అయ్యాచార దీక్షలు బోధించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ.. చిన్నతనం నుంచే పిల్లలకు పాండిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం, పఠించడం వల్ల మానవుడు ప్రశాంత జీవనం గడపడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
సీఎం డీకేశీకి సన్మానం
హొసపేటె: ‘మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ రాజకీయ నాయకుడు హెచ్జీ రాములు నాకు తండ్రిలాంటి వారు. నేను స్టూడెంట్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పటి నుంచి నేను ఆయన ఆశీస్సులు, మార్గదర్శకత్వం పొందుతూనే ఉన్నాను’. అని ముఖ్యమంత్రి డీకే.శివకుమార్ అన్నారు. శనివారం సాయంత్రం గంగావతి సమీపంలోని భూదేశ్వర ఆలయంలో మాజీ ఎంపీ హెచ్జీ రాములు ఆయన కుటుంబ సభ్యులు సీఎం డీకే శివకుమార్ను సన్మానించారు.


