యశవంతపుర: ‘ప్రజలు తమ పనుల కోసం ప్రభుత్వ కార్యాలయాలకు పరుగులు తీసే రోజులు అంతం కానున్నాయి. ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చి సమస్యలను పరిష్కరిస్తుంది’ అని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చెప్పారు. ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేసిన ప్రజా సేవా శాఖ ద్వారా శనివారం తొలిసారిగా విజయనగర జిల్లా కూడ్లిగిలో అభియాన నిర్వహించారు. సీఎం డీకే పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలను ఆలకించారు. ప్రజలు అందజేసిన సమస్యలపై అధికారులు పరిష్కార చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఈ సందర్భంగా వందలాది మంది సీఎంకు తమ కష్టనష్టాలను ఏకరువు పెట్టారు. పెద్దసంఖ్యలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
హాసన్లో రైతు ఆత్మహత్యాయత్నం
పక్క భూమి యజమాని పెడుతున్న వేధింపులు తట్టుకోలేక రైతు ఒకరు మంత్రికి అర్జీ ఇచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన హాసన్లో కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. శనివారం ఉదయం ప్రజా సేవా అభియానలో భాగంగా ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు ఇవ్వడానికి వచ్చారు. హాసన్ తాలూకా హొసహళ్లికి చెందిన కరీగౌడ (35) మంత్రి కెఎం శివలింగేగౌడకు భూ వివాదంపై మంత్రికి అర్జీ సమర్పించారు. పక్క పొలంవారు తనను వేధిస్తున్నట్లు చెబుతూ అక్కడే పురుగుల మందును తాగాడు. ఇతర రైతులు అడ్డుకుని ఆస్పత్రికి తరలించారు. హాసన్ తాలూకా శాంతిగ్రాంలోని అంబేడ్కర్ వసతి పాఠశాల దయనీయ స్థితిలో ఉన్నట్లు పత్రికలలో వార్తలు రావటంతో మంత్రి శివలింగేగౌడ అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులను మరో హాస్టల్కు తరలించి దానికి మరమ్మతులు చేయాలని ఆదేశించారు. 172 మంది విద్యార్థులను ఒక షెడ్లో ఎలా ఉంచుతారని ప్రశ్నించారు.
సీఎం డీకే శివకుమార్
కూడ్లిగిలో ఘనంగా ప్రజాసేవా అభియాన్
ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకారం


