సాక్షి, బళ్లారి: తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలని కర్ణాటక ప్రాంత రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కర్ణాటక ప్రాంత రైతు సంఘం ఆధ్వర్యంలో సిరుగుప్ప పట్టణంలో ఆందోళన చేపట్టారు. సిరుగుప్ప ప్రధాన వీధుల్లో ర్యాలీ చేపట్టారు. బస్సులు, వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రాంత రైతు సంఘం అధ్యక్షుడు మాధవ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఏడాది తీవ్ర వర్షభావ పరిస్థితులే నెలకొన్నప్పటికి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. పంటలు పండక, పెట్టిన పెట్టుబడులు రాక రైతులు కష్టాల్లో కురుకుపోయినప్పటికి సిరుగుప్ప తాలూకాను కరువు ప్రాంతంగా ప్రకటించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు. వేదావతి, తుంగభద్ర నదిలో చుక్క నీరు లేక బీటలు వారాయన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నీటి సమస్యతో అల్లాడిపోతున్నారని పేర్కొన్నారు. తక్షణం తుంగభద్ర డ్యాం నుంచి నీరు విడుదల చేయాలన్నారు. డ్యాంలో 95 టీఎంసీల నీరు ఉన్నా ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా స్థానిక పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


