బళ్లారి రూరల్: ‘ఉన్నత న్యాయస్థానం ఆదేశాలను అనుసరించి తనకు పరిహారం చెల్లించాలి. లేకపోతే పోరాటం చేస్తా’ అని ఆర్.హెచ్.చెన్నబసవ స్వామి తెలిపారు. శుక్రవారం పత్రికా భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నగరంలోని గుగ్గిరహట్టి పంచాచార్య ఉన్నత పాఠశాలలో 1987 మే 30వ తేదీన ఉపాధ్యాయుడిగా చేరినట్లు తెలిపారు. పాఠశాల పాలక మండలి నియామక ఉత్తర్వులు కూడా అందజేసిందన్నారు. రెండు సంవత్సరాల తరువాత ఉజ్జయిని పాఠశాలకు బదిలీ చేశారని తెలిపారు. అయితే ఉజ్జయిని పాఠశాలలో పోస్ట్ లేదంటూ జాయినింగ్ ఆర్డర్ ఇవ్వలేదని పేర్కొన్నారు. తాను రాజీనామా చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి ఉద్యోగం పోయేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగిందన్నారు. 37 ఏళ్ల పాటు జీతం లేకుండా జీవించినట్లు తెలిపారు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. మూడు నెలల్లో పరిహారం చెల్లించాలని ఉజ్జయిని పాఠశాల, డీడీపీఐకి ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. అయితే 8 నెలలు గడిచినా తనకు పరిహారం అందలేదన్నారు. సమావేశంలో విశ్రాంత ఉపాధ్యాయుడు సి.ఎం.గంగాధరయ్య,విశ్రాంత ప్రిన్స్పాల్ ఎ.ఎస్.ప్రభయ్య పాల్గొన్నారు.


