శివాజీనగర: అధికార కాంగ్రెస్లో మళ్లీ పదవుల పందేరం వేడి మొదలైంది. వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలి కేసులో మంత్రి బి.నాగేంద్ర రాజీనామా చేయడంతో కాంగ్రెస్ కేబినెట్లో 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఆ పదవుల కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కన్నేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే మరింత గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని హైకమాండ్ నాయకులు భావిస్తున్నారు. అందుకే సీఎం డీకే శివకుమార్ కేబినెట్ విస్తరణను పక్కనపెట్టి కార్పొరేషన్లు, బోర్డుల అధ్యక్షుల నియామకాల ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిసింది. అలాగే 5 విధాన పరిషత్ సీట్ల నియామకం జరగనుంది. పెద్దసంఖ్యలో నేతలు పోటీ పడుతున్నారు.
గొడవలతో సతమతం
సీఎం డీకే శివ ఇటీవల ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ పెద్దలతో చర్చలు జరిపారు. మళ్లీ మంత్రి పదవుల పంపిణీని ముట్టుకుంటే లేని సమస్యలు తలెత్తవచ్చని అనుకున్నారు. దీనివల్ల పునర్వ్యవస్థీకరణపై సానుకూల నిర్ణయం తీసుకోలేదు. కేబినెట్ను కదిలించినప్పుడల్లా అసమ్మతి చెలరేగడం, వివాదాలు చుట్టుముట్టడంతో డీకే సర్కారుకు సమస్యగా తయారైంది. ఇప్పుడు 2 మంత్రి పదవులను భర్తీ చేస్తే మళ్లీ గందరగోళానికి, అసంతృప్తికి దారితీయవచ్చనే భావన పార్టీ అగ్రనేతల్లో నెలకొంది.
పీఠం ఇచ్చి బుజ్జగింపు
కేబినెట్ భర్తీ కంటే ముందు కార్పొరేషన్, బోర్డుల పదవులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో భర్తీ చేసే అవకాశముంది. చాలా ప్రభుత్వ సంస్థలకు సారథుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ పదవులను నేతలకు కట్టబెట్టి బుజ్జగించే పని చేపట్టనున్నారు. అలాగే 5 విధాన పరిషత్ సీట్ల నామినేషన్ల ప్రక్రియను కూడా సీఎం చేపడతారు. ఇందుకు ఢిల్లీ నుంచి పచ్చజెండా లభించినట్లు సమాచారం.
ఎమ్మెల్సీ సీట్లకు రేసు
5 ఎమ్మెల్సీ సీట్ల కోసం చాలామంది ఆశావహులు క్యూలో ఉన్నారు. గత జూలైలో ఖాళీ అయిన ఈ స్థానాలకు అభ్యర్థులను నామినేట్ చేసే పని సాగుతోంది. ఈ స్థానాలకు కళ, సాహిత్యం, సినీరంగం, సమాజ సేవా వంటి రంగాలకు చెందిన ప్రముఖులను నామినేట్ చేయాల్సి ఉంది. డీకే చిన్ననాటి స్నేహితుడు వీ.రవిచంద్రన్, మాజీ సీఎం సిద్దరామయ్య మీడియా కార్యదర్శి కేవీ ప్రభాకర్ పేర్లు వినిపిస్తున్నాయి. రమేష్బాబు, యూబీ వెంకటేష్, రాణీ సతీష్, కామ్ నాయక్, విజయ్ ముళగుంద్లు సైతం రేసులో ఉన్నారు.
త్వరలో మరో దఫా పదవుల పంపకాలు
సీఎం డీకే శివకుమార్ ముందు సవాలు
ముట్టుకుంటే వివాదాలే
కాంగ్రెస్ హైకమాండ్ సూచన
కార్పొరేషన్లు, బోర్డుల అధ్యక్ష పదవుల భర్తీపై సీఎం దృష్టి
మంత్రి ఖర్గే రాజీనామా తథ్యం
బీజేపీ నేత అశోక్ జోస్యం
హొసపేటె: వాల్మీకి మండలి కుంభకోణంలో నాగేంద్ర రాజీనామా చేసిన తర్వాత, కేపీఎస్సీ కుంభకోణంలో మంత్రి ప్రియాంక్ ఖర్గే రాజీనామా చేస్తారని బీజేపీ పక్ష నాయకుడు ఆర్.అశోక్ అన్నారు. మంగళవారం ఆయన హొసపేటెలో మాట్లాడుతూ వాల్మీకి అభివృద్ధి మండలి కుంభకోణం, కరువు, కేపీఎస్సీ స్కాం సహా పలు సమస్యలపై తాము పాదయాత్ర చేస్తున్నామననారు. తమ పోరాటం వల్లనే నాగేంద్ర రాజీనామా చేశారన్నారు. ఇప్పుడు కేపీఎస్సీ కుంభకోణంలో ఒక ఐఏఎస్ అధికారిని అరెస్టు చేశారు, అది సరిపోదు. ఇందులో ప్రమేయం ఉన్న వారందరనీ అరెస్టు చేయాలి, మంత్రి ఖర్గే రాజీనామా చేయడం ఖాయం అని అన్నారు. ఈ పాదయాత్రలో జేడీఎస్ పాల్గొనకపోవడంపై స్పందిస్తూ తాను హెచ్డీ కుమారస్వామితో మాట్లాడతాని, తమ పొత్తులో ఎలాంటి సమస్య లేదని అన్నారు.


