శివాజీనగర: కర్ణాటకలో హెచ్1ఎన్1 (స్వైన్ ఫ్లూ) కేసులు వేగంగా వ్యాపించడం వైద్య వర్గాల్లో ఆందోళనను కలిగిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు రాష్ట్రంలో 4,125 మంది దీని బారిన పడ్డారు. ఇవి ఆస్పత్రుల్లో పాజిటివ్ వచ్చినవారు మాత్రమే, ఇక ఆస్పత్రుల వరకూ రాని బాధితులు కూడా చాలామందే ఉన్నట్లు అంచనా. సగానిపైగా కేసులు బెంగళూరులోనే బయటపడడం గమనార్హం. ఈ అంటువ్యాధిని అరికట్టడానికి ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.
లక్షణాలు, వ్యాప్తి
ఈ జబ్బును స్పానిష్ ఫ్లూ అని కూడా అంటారు. చలిజ్వరం, దగ్గు, జలుబు, తుమ్ములు, ఒంటి నొప్పులు, గొంతుమంట, తలనొప్పి, అలసట వంటి లక్షణాలు ఉంటాయి. రోగగ్రస్తుల నుంచి సులభంగా ఇతరులకు వ్యాపిస్తుంది. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు రోగ వైరస్ గాల్లోకి కలిసి ఇతరులకు సోకుతుంది. సకాలంలో గుర్తించి వైద్యం తీసుకోవడం ఉత్తమం. ఈ జబ్బు వందేళ్ల కిందట పందుల నుంచి మానవులకు సోకడంతో స్వైన్ ఫ్లూ అని పేరుపెట్టారు. ఈ లక్షణాలుంటే సొంత వైద్యం మాని ఆస్పత్రికి వెళ్లాలని వైద్యులు సూచించారు.
రాష్ట్రంలో హెచ్1ఎన్1 కేసుల భయం
8 నెలల్లో 4,125 మందికి సోకింది
సగానికిపైగా బెంగళూరు సిటీలోనే


