మైసూరు: చామరాజనగర జిల్లా, హనూరు తాలూకాలోని కావేరి అరణ్యంలో అటవీ సిబ్బంది జరిపిన కాల్పుల్లో ముగ్గురు స్థానికులు మరణించిన తరువాత జిల్లాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఆగస్టు 15 నుంచి హనూరు పరిసరాల్లో భారీగా పోలీసులు, దుఃఖంతో ఉన్న అడవిలోని పల్లెలు, దర్యాప్తు బృందాల వాహనాల సందడి కనిపిస్తోంది. అటవీ అధికారులు ఆ రోజు ఘటన జరిగిన ప్రాంతంలో పనిచేసిన 12 మంది ఉద్యోగులను ప్రశ్నించారు. వేటగాళ్లు అడవిలోకి ప్రవేశించారని సమాచారం అందడంతో, మొత్తం 12 మంది రెండు బృందాలుగా ఆపరేషన్లోకి దిగినట్లు చెప్పారు. ఆ సిబ్బందిని అధికారులు వేర్వేరుగా ప్రశ్నిస్తున్నారు. అడవిలో 8 కిలోమీటర్ల లోపల జరిగింది, ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపినట్లు సిబ్బంది చెప్పారని ఏసీఎఫ్ మారిస్వామి తెలిపారు.
బీజేపీ నిజనిర్ధారణ కమిటీ
ఎన్కౌంటర్పై నిజానిజాలను తెలుసుకోవడానికి బీజేపీ ఒక నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. జిల్లా బీజేపీ అధ్యక్షుడు నిరంజన్ కుమార్, మాజీ మంత్రి ఎన్. మహేష్, రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షుడు, హనూర్ వెంకటేష్లతో కూడిన ఐదుగురు సభ్యుల బందం లసార్ దొడ్డి గ్రామంలో మృతుడు కుమార్ ఇంటికి వెళ్లి భార్యను, కుటుంబ సభ్యులను ఓదార్చారు. అటవీ శాఖ సిబ్బందే తమవారిని కాల్చి చంపారని ఆరోపించారు. తప్పిపోయిన ఆవును వెతుక్కుంటూ వెళ్లారన్నారు. వారితో రైఫిల్, మాంసం ఏవీ లేవన్నారు.
తమిళనాడు బృందం పరామర్శ
తమిళనాడు పట్టాలి మక్కల్ కచ్చి (పీఎంకే) పార్టీ మాజీ ఎమ్మెల్యేలతో సహా ఐదుగురు నాయకులు తోమియార్ పాళ్య, లసార్ దొడ్డి, కావేరి గ్రామాలకు వెళ్లారు. కుటుంబాలను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ మాట్లాడుతూ, స్వాతంత్య్ర దినోత్సవం నాడు జరిగిన ఈ ఘటన చాలా విచారకరం, అడవుల్లో నివసించే ప్రజల జీవన పరిస్థితులను అర్థం చేసుకోవాలి. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే, వారికి చట్ట ప్రకారం జరిమానా విధించవచ్చు లేదా శిక్షించవచ్చు. అంతేకానీ ప్రాణం తీసే హక్కు ఎవరికీ లేదు అని అన్నారు. ఇస్తున్న పరిహారం సరిపోదు. మరింత చెల్లించాలి, కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాలు తెలియాలంటే నిష్పక్షపాత విచారణ అవసరం. దోషులు ఎవరైనా సరే, వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్ చేశారు.
12 మంది అటవీ సిబ్బందికి ప్రశ్నలు
మృతుల కుటుంబాలకు
తమిళ నేతల పరామర్శ
మైసూరు: చామరాజనగర జిల్లాలోని హనూరు తాలూకాలోని కావేరి అభయారణ్యంలో వేటగాళ్ల నిరోధక శిబిరాలు, అటవీ సిబ్బంది నివాసాలపై కొందరు దుండగులు దాడి చేసి ధ్వంసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 15న ఎన్కౌంటర్ తరువాత ఈ సంఘటనలు జరగడం గమనార్హం. శిబిరాలను జిలెటిన్ స్టిక్స్తో పేల్చివేసినట్లు వెల్లడైంది. షగ్య పరిధిలోని హోళేమురి దత్తి, పేటగరణ గుడ్డ, బుడికెరె, కల్లాదొడ్డి అనే 4 చోట్ల వేట నిరోధక శిబిరాలు, సిబ్బంది నివాసాల మీద దుండగులు దాడి చేసినట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. హోళెమురిదట్టి సమీపంలోని ఒక లాడ్జిని ధ్వంసం చేశారు. మరో కొత్త లాడ్జిలోని ఫర్నిచర్, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఎవరు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారనేది ఇంకా తెలియరాలేదు. ఈ పరిణామం అటవీ సిబ్బందిలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వేటగాళ్లు, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి వేట నిరోధక శిబిరాలు ముఖ్యమైన ప్రదేశాలు. పోలీసులతో సహా అటవీ శాఖ ఉన్నతాధికారులు సంఘటనా స్థలాలను పరిశీలించారు. దుండగుల కోసం గాలింపు చేపట్టారు.
తనిఖీ సాగుతోంది: సీఎం
యశవంతపుర: చామరాజనగర జిల్లా హనూరులో అటవీ సిబ్బంది కాల్పుల ఘటనపై తనిఖీ జరుగుతున్న సమయంలో తాను మాట్లాడటం సరికాదని సీఎం డీకే శివకుమార్ అన్నారు. బెంగళూరు సదాశివనగర నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ హనూరులో కొందరు జిలెటిన్ కడ్డీలతో పేలుళ్లకు పాల్పడడం వెనుక తమిళనాడువాసుల ప్రమేయం ఉన్నట్లు అనుమానం వెలిబుచ్చారు. కాల్పుల ఘటనపై విచారణ సాగుతోందన్నారు.


