దొడ్డబళ్లాపురం: బిడది టౌన్షిప్ ఏర్పాటుకు భూములు ఇచ్చేది లేదని కొందరు రైతులు తీవ్ర పోరాటానికి దిగడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. ఈ పథకంపై కష్టనష్టాలు బేరీజు వేసి నివేదిక ఇచ్చేందుకు సీఎం డీకే శివకుమార్ ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. విధానసౌధలో అధికారులతో సమావేశంలో ఇది తెలిపారు.
బలవంతంగా తీసుకోం
సీఎం మీడియాతో మాట్లాడుతూ త్వరలో కమిటీని ప్రకటిస్తాం, కమిటీ సభ్యులు రైతులను కలిసి వారి నుంచి అభ్యంతరాలు ఉంటే స్వీకరించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తారన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకునేది లేదన్నారు. స్వచ్ఛందంగా ఇస్తే తీసుకుంటామన్నారు. రెడ్ జోన్లో ఉన్న భూములను మార్చబోమన్నారు. అధికారులపై దయచేసి దాడులు చేయవద్దని, కావాలంటే తనపై దాడి చేయండని సీఎం అన్నారు. ఈ సంఘటన తనను ఎంతో బాధించిందన్నారు. ఇది రాజకీయ ప్రేరేపితమని ఆరోపంచారు. ఇదేమీ తన కలల ప్రాజెక్టు కాదన్నారు. డీకే శివకుమార్ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు అన్న కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తనకు జైలు కొత్త కాదన్నారు. గతంలో జైలుకు పంపడం వెనుక ఎవరెవరు కుట్రలు చేశారో బయట పెడతానన్నారు.
మరిన్ని గ్రామాల్లో భూసేకరణ
బిడది టౌన్షిప్కు 2వ విడత భూసేకరణకు ప్రభుత్వం అంతిమ జీఓను విడుదల చేసింది. టౌన్షిప్ కోసం మొత్తం 2,550 ఎకరాల పైగా భూమిని తీసుకోనుంది. జీఓ ప్రకారం కేజీ గొల్లరపాళ్యలో 313 ఎకరాలు, బన్నిగిరి గ్రామంలో 775 ఎకరాలు, అరళాలుసంద్రలో 1,460 ఎకరాల భూ సేకరణ చేస్తారు. దీంతో ఆయా గ్రామాల్లోనూ అలజడి రేగే అవకాశముంది.
రైతులతో చర్చించి నివేదిక
అధికారులపై కాదు, నాపై దాడి చేయండి
సీఎం డీకే శివకుమార్


