రాయచూరులో రైలు ఎక్కుతున్న కూలీలు
కవితాళలో ఇళ్ల వద్ద నివాసమున్న వృద్ధులు
నగరంలో పనుల కోసం వేచి ఉన్న కూలీలు
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక రైతులు, వ్యవసాయ కూలీలు ఉపాధి కోసం సుదూరంలోని ఇతర నగరాలకు వలసలు వెళుతున్నారు. నేతలు ఎందరు మారినా తమ బతుకులు మాత్రం మారలేదనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, యాదగిరి, కొప్పళ, బీదర్, కలబుర్గి జిల్లాల్లో తుంగభద్ర, భీమా, అమర్జా, బెణ్ణెతోరా, కృష్ణా, ఘటప్రభ, మలప్రభ నదులున్నా వ్యవసాయ కూలీలకు పనులు లభించక బతుకు తెరువు కోసం, జీవనోపాధి కోసం రైతులు మూటాముల్లే సర్దుకుని బెంగళూరు, ముంబై, షోలాపూర్, గోవా, మహారాష్ట్ర, చైన్నె, హైదరాబాద్ ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. రాయచూరు, యాదగిరి, బీదర్, కలబుర్గి జిల్లాల ప్రజలు ప్రతి రోజూ వందలాది మంది బెంగళూరుకు రైలులో ప్రయాణిస్తున్నారు. వారిని కదిలిస్తే కళ్లలో కన్నీరు వస్తాయి. గ్రామాల్లో వృద్ధులను వదిలి పిల్లా పాపలతో కట్టుబట్టలతో వలస పోతున్నారు. ఈ ప్రాంతాల నుంచి ఎన్నికై న ప్రజా ప్రతినిధులు వలసల నివారణకు ఎలాంటి పథకాలను ప్రారంభించాలనే తపన ఏ ఒక్కరి మదిలోనూ లేకపోవడం విడ్డూరంగా ఉంది. అధికారం కోసం తహతహలాడే నేతలు రైతన్నలు పడుతున్న ఈతి బాధలను పరిష్కరించడంలో మాత్ర ంమౌనం పాటిస్తున్నారు.
నేతలు ఎందరు మారినా
లభించని కూలి పనులు
మూటాముల్లేతో సుదూర
నగరాలకు తరలుతున్న వైనం
కూలీల కోసం పరిశ్రమలు ఏర్పాటు చేయాలి
జిల్లాలో సమగ్రమైన వనరులున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. పత్తి, వరి పంటలను అధికంగా పండించే రైతులకు, వ్యవసాయ కూలీలకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే అభివృద్ధికి అవకాశం ఉంటుంది. రాజకీయ నాయకుల్లో చిత్తశుద్ధి లోపించడం కూడా ఈ పరిస్థితికి కారణం.
–రాఘవేంద్ర కుష్టిగి, జనాందోళన సమితి కార్యాధ్యక్షుడు
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా..
జిల్లాకు రెండు వైపులా కృష్ణ, తుంగభద్ర నదులు, సారవంతమైన భూములు, హట్టి బంగారు నిక్షేపాల కంపెనీ, విద్యుత్ ఉత్పత్తి చేసే ఆర్టీపీఎస్, వైటీపీఎస్ యూనిట్లు ఉన్నాయి. న్యూఢిల్లీ, బెంగళూరు, చైన్నె, ముంబైలకు నేరుగా రైలు మార్గం వంటి సౌకర్యాలున్నా ఫలితం లేదు.
–చామరస మాలిపాటిల్, రాష్ట్ర రైతు సంఘం కార్యాధ్యక్షుడు


