బనశంకరి: మార్చి 31న ఉడుపి జిల్లా కుందాపురలో కిడ్నాపైన వ్యక్తి తెలంగాణలో దొరికాడు. వివరాలు.. కుందాపుర నివాసులు రాజేష్, రామ మడివాళ, సోదరుడు లక్ష్మణకు అనారోగ్యంగా ఉండటంతో మణిపాల్లోని కేఎంసీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఈ సమయంలో క్యాంటీన్ టీ తాగుతుండగా నంబరు ప్లేట్ లేని నలుపు రంగుకారులో వచ్చిన 8 మంది రాజేష్ను బలవంతంగా లాక్కుని కారులో బంధించి తీసుకెళ్లారు. సోదరుల ఫిర్యాదుమేరకు కుందాపుర పోలీసులు తీవ్రంగా గాలింపు జరిపారు. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల, గోవిందపల్లి వద్ద గల సిల్వర్ స్కై లాడ్జ్లో దాచి ఉంచినట్లు తెలుసుకుని దాడి చేశారు. బాధితున్ని కాపాడి 8 మంది కిడ్నాపర్లను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ హరిరాం శంకర్ తెలిపారు. మల్లారెడ్డి, తుళజా, నరసింగ, హుసేన్, శంకర, నాగేశ్, పరమేశ్వర్, విజయ్ అనే 8మంది పట్టుబడ్డారు. ఆర్థిక గొడవలే కిడ్నాప్కు కారణమని సమాచారం.
సౌకర్యాల కోసం ఆదివాసీల ధర్నా
మైసూరు: చామరాజనగర జిల్లా హనూరు తాలూకా మలేమహదేశ్వర గ్రామ పంచాయతీ పరిధిలోని మేదగనాణే హాడిగేలో తాగునీరు, విద్యుత్ తదితర సౌకర్యాలు కావాలని జిల్లా ఆదివాసీల హితరక్షణ సమితి, ప్రగతిపర సంఘాల భాగస్వామ్యంలో ఆదివాసీలు ఉపవాస సత్యాగ్రహం చేపట్టారు. ప్రభుత్వం, అటవీ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ గ్రామానికి విద్యుత్ సరఫరాకు ఏడాది క్రితమే అన్ని ఏర్పాట్లు చేసినా అటవీశాఖ అధికారులు అడ్డు చెప్పడం వల్ల తాము చీకట్లో మగ్గుతున్నట్లు చెప్పారు. వెంటనే తమకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలని కోరారు. రాత్రి అంతా ఆందోళన జరగ్గా, మలేమహదేశ్వర బెట్ట పోలీసులు బందోబస్తు సాగించారు.
ఏనుగు దాడిలో కాఫీ రైతు మృతి
యశవంతపుర: అడవి ఏనుగు దాడిలో రైతు బలైన ఘటన ఆదివారం ఉదయం హాసన్ జిల్లా బేలూరు తాలూకా అరెహళ్లి హొబళి కణగుప్పె గ్రామంలో జరిగింది. రైతు రాజశేఖర్ ఉదయమే ఇంటి నుంచి కాఫీతోటకు వెళ్లాడు. తోటలో పనిలో ఉండగా, ఓ ఏనుగు నుంచి వేగంగా వచ్చి అతనిని కాళ్లతో తొక్కి చంపేసింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు, అటవీ సిబ్బంది, పోలీసులు వెళ్లి మృతదేహాన్ని తీసుకువచ్చారు. 6 నెలల క్రితం ఇదే గ్రామానికి చెందిన రైతు ద్యావమ్మ కూడా ఓ ఏనుగు ఇలాగే హతమార్చింది. దీంతో రైతులు పొలాలకు, తోటలకు వెళ్లాలంటే భయపడుతున్నారని రైతు నేత కెజి కుమార్ చెప్పారు. వెంటనే ఏనుగులను బంధించాలని డిమాండ్ చేశారు.
కారు– బస్సు మధ్య నలిగి..
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో మైసూరు శాటిలైట్ బస్టాండ్లో ఘోరం జరిగింది. కారు– బస్సు మధ్య ఇరుక్కుని వ్యక్తి దుర్మరణం చెందాడు. బెంగళూరు సుంకదకట్టె నివాసి శ్యామ్ దొరె (45) మృతుడు. భార్యతో కలిసి తమిళనాడులో బంధువు చనిపోతే వెళ్లి చూసి వచ్చారు. మైసూరు రోడ్డులోని శాటిలైట్ బస్టాండులో దిగి పార్కింగ్ లాట్లో బస్సు కోసం వేచి చూస్తున్నారు. ఒక కారు రివర్స్ చేస్తుండగా శ్యామ్ కాస్త వెనక్కు జరిగి అక్కడే నిలిపి ఉన్న బ్లడ్ బ్యాంక్ బస్సుకి ఆనుకుని నిల్చున్నాడు. అయితే కారు అలాగే రావడంతో కారు– బస్సు మధ్య ఇరుక్కుని శ్యామ్ అక్కడే చనిపోయాడు. బ్యాటరాయనపుర పోలీసులు కేసు నమోదు చేశారు.


