చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరంలో గంగమ్మ ఆలయంలో శనివారం రాత్రి శ్రీ ధర్మరాయస్వామి, ద్రౌపదీదేవి పూల కరగ సంబరం ఆద్యంతం భక్తులను పరవశుల్ని చేసింది. పూజారి ధర్మేంద్ర కరగనెత్తుకుని నాట్యమాడారు. ఆలయం నుంచి ప్రారంభమైన కరగ నగర వీధుల గుండా భారీ సందోహం మధ్య సాగింది. ప్రధాన సర్కిళ్లలో కరగధారి నృత్యం చేయగా భక్తులు హర్షధ్వానాలు చేశారు. జూనియర్ కాలేజీ ఆవరణలో వేదికపై నృత్య ప్రదర్శన సాగింది. ప్రజలు ప్రతి వీధిలో కరగకు పూజలు చేసి ఘన స్వాగతం పలికారు. నగరంలోని 31 వార్డులలో కరగ సంచరించింది. ఆదివారం మధ్యాహ్నం వరకు ఊరేగింపు సాగింది. ఎస్పీ కుశాల్ చౌక్సె కరగ ఉత్సవంలో పాల్గొని పోలీస్ బందోబస్తు నిర్వహించారు.


